భీష్మా కు అవార్డ్స్ అంటూ మోసం చేశారు

రీల్ కు రియల్ కు మధ్య వ్యత్యాసం ఎంతలా ఉంటుందన్న విషయాన్ని చెప్పే వైనంగా దీన్ని చెప్పాలి. అపరిమితమైన తెలివితేటలతో.. ప్రత్యర్థులకు మైండ్ గేమ్ తో చుక్కలు చూపించేలా సినిమా తీసిన దర్శకుడు ఆయన. సూపర్ హిట్ సినిమా తీయటమే కాదు.. తన సినిమాలో హీరో చేత మైండ్ గేమ్ ఆడించి.. విలన్లను చిత్తు చేయటం చూశాం. అలాంటి దర్శకుడికి సైబర్ దొంగలు జెల్లకాయ ఇచ్చిన వైనం సంచలనంగా మారింది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు? అంతలా ఆయన ఎలా బుక్ అయ్యారు? ఏ మాటలకు ఆయన పడిపోయారు? అన్న వివరాల్లోకి వెళితే..

గత ఏడాది బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటైన భీష్మ సినిమా గుర్తుంది కదా. లాక్ డౌన్ కు ముందు విడుదలై.. అందరిని విపరీతంగా ఆకట్టుకున్న సినిమా అది. ఆ సినిమా తర్వాత కొన్నిరోజులకే లాక్ డౌన్ పుణ్యమా అని సినిమా థియేటర్లకు వెళ్లలేని పరిస్థితి. దీంతో.. చాలామందికి లాక్ డౌన్ ముందు థియేటర్లో సినిమా చూసిన చివరి సినిమా భీష్మానే. ఆ సినిమాకు దర్శకుడు వెంకీ కుడుముల. హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులకు తాజాగా ఆయన ఫిర్యాదు ఇచ్చారు. తనను సైబర్ దొంగలు మోసం చేసినట్లుగా పేర్కొన్నారు.

దీంతో ఆశ్చర్యపోయిన పోలీసులు.. అసలేం జరిగిందన్న ఆరా తీశారు. జరిగిందేమంటే.. నితిన్ హీరోగా నటించిన భీష్మ చక్కటి విజయాన్ని సాధించిన నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు.. చిత్ర దర్శకుడికి ఫోన్ చేశారు. త్వరలో జరగబోయే అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కు వారి చిత్రాన్ని అన్ని వర్గాల్లో నామినేట్ చేయనున్నట్లు చెప్పారు. వారి మాటలన్ని నమ్మకం కలిగిన దర్శకుడు.. వారు చెప్పినట్లుగా దఫాల వారీగా మొత్తం రూ.66వేలను చెల్లించాడు.

తర్వాత రోజు దర్శకుడికి ఫోన్ చేసిన సైబర్ దొంగలు.. తమ వల్ల చిన్న పొరపాటు జరిగిందని.. ఆరు విభాగాల్లో నామినేట్ చేయటానికి బదులుగా మూడింటిలోనే చేశామని.. వాటిని సరి చేయటానికి మరికొంత డబ్బు కావాలని అడిగారు. అప్పటివరకు వారి మాటల మీద నమ్మకం ఉన్న దర్శకుడు..అనుమానం వచ్చింది. దీంతో.. ఆరా తీశారు. ప్రాథమికంగా సైబర్ నేరగాళ్లుగా గుర్తించారు. దీంతో.. తాను ఇచ్చిన మొత్తం గాల్లో కలిసిపోయిందన్న విషయాన్ని అవగాహనకు వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేశారు. నేరగాళ్లు ఉపయోగించిన ఫోన్ ఇతరత్రా వస్తువులతో వారి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తన సినిమాల్లోమైండ్ బ్లాక్ అయ్యేలా వ్యూహాలు సిద్దం చేసిన హీరోను తెర మీద నడిపించే దర్శకుడు.. ఇలా సైబర్ దొంగల ధాటికి అడ్డంగా బుక్ కావటం షాకింగ్ గా మారింది.