మారుతి.. ఫస్ట్ టైం రీమేక్?

టాలీవుడ్లో ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుల్లో మారుతి ఒకడు. ఈ రోజుల్లో, బస్ స్టాప్ లాంటి చిన్న సినిమాలతో ప్రస్థానం ఆరంభించి విక్టరీ వెంకటేష్ లాంటి పెద్ద హీరోను డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగాడతను. నాని, శర్వానంద్, సాయిదరమ్ తేజ్ లాంటి యంగ్ హీరోలకు అతను సూపర్ హిట్లు ఇచ్చాడు. ఇప్పుడు అతను సీనియర్ హీరో, యాక్షన్ సినిమాలకు పేరుపడ్డ గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్’ పేరుతో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

మారుతి గత సినిమాలతో పోలిస్తే దీనికో ప్రత్యేకత ఉన్నట్లుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా మారుతి సొంత కథలతోనే సినిమాలు చేయగా.. తొలిసారి ఓ అరువు కథతో ‘పక్కా కమర్షియల్’ తీయబోతున్నాడని అంటున్నారు. ఈ చిత్రం బాలీవుడ్ హిట్ మూవీ ‘జాలీ ఎల్ఎల్‌బీ-2’కు రీమేక్ అని ప్రచారం నడుస్తోంది. అర్షద్ వార్సీ హీరోగా నటించిన ‘జాలీ ఎల్ఎల్‌బీ’ ఇప్పటికే సప్తగరి హీరోగా రీమేక్ అయింది. అది సరిగా ఆఢలేదు.

ఐతే ‘జాలీ ఎల్ఎల్‌బీ’ సీక్వెల్లో అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరో నటించాడు. అది చాలా బాగా ఆడింది. దాన్ని తెలుగులో రీమేక్ చేయాలని చాన్నాళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ వర్కవుట్ కాలేదు. ఐతే ఇప్పుడు మారుతి ఆ కథను టేకోవర్ చేశాడని సమాచారం. ఐతే మాతృకను ఉన్నదున్నట్లుగా తీయకుండా మారుతి తన టచ్ ఇవ్వనున్నాడట. మూల కథ మాత్రమే తీసుకుని కథనమంతా తన స్టయిల్లో చేసుకున్నాడట మారుతి. ఇటీవల రిలీజ్ చేసిన ‘పక్కా కమర్షియల్’ ఫస్ట్ లుక్ చూస్తే హీరో లాయరే అన్న సంకేతాలు కనిపించాయి. దీంతో ఇది ‘జాలీ ఎల్ఎల్‌బీ-2’ రీమేకే అన్న సందేహాలు బలపడుతున్నాయి.

మాతృకలో ఓ సీరియస్ కథ ఉంటుంది. అదే సమయంలో వినోదానికి ఢోకా ఉండదు. తెలుగులో మారుతి తీస్తున్నాడు కాబట్టి సినిమా మరింత వినోదాత్మకంగా తయారయ్యే అవకాశముంది. ఇంతకుముందు మారుతితో భలే భలే మగాడివోయ్, ప్రతి రోజూ పండగే చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ ఉమ్మడిగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నాయి. త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ చిత్రం అక్టోబరు 1న విడుదల కానుంది.