ఇరుముడి సామీ… ఇప్పట్లో తగ్గడు సుమీ  

బహుశా గత ఇరవై సంవత్సరాల టాలీవుడ్ పీరియడ్ ని తీసుకుని, ఇరుముడి సాధిస్తున్నది చూస్తుంటే మళ్ళీ ఇంకో సినిమా దాన్ని రిపీట్ చేయాలంటే అంత ఈజీ కాదనే సమాధానం ప్రతి ఒక్కరి దగ్గరా వినిపిస్తోంది. ఎందుకంటే పదిహేడో రోజు కూడా ఏ మాత్రం తగ్గకుండా ఈ మూవీ కొల్లగొట్టిన కలెక్షన్లు చూసి ట్రేడ్ కు నోట మాట రావడం లేదు. బయ్యర్ వర్గాల ప్రకారం నిన్న ఒక్క రోజే  ప్రపంచవ్యాప్తంగా పది కోట్లకు పైగా గ్రాస్ నమోదయ్యిందట. అందులో తెలుగు రాష్ట్రాల వాటానే అధికం.

ప్రస్తుతం రెండు వందల యాభై కోట్ల వైపు పరుగులు పెడుతున్న ఇరుముడి ఫైనల్ రన్ కల్లా ట్రిపుల్ సెంచరీ చేయడం ఖాయమనిపిస్తోంది. నిన్న చాలా సెంటర్లలో రంభ ఊర్వశి మేనక, రోమాంచకం, ఐయామ్ గేమ్ కన్నా వేగంగా ఇరుముడినే ఫాస్ట్ ఫిల్లింగ్ కావడం గమనించాల్సిన విషయం. ఏపీ తెలంగాణ మెయిన్ స్క్రీన్లు మూడో వారంలోనూ ఒకే సినిమా కంటిన్యూ చేయడం ప్యాన్ ఇండియా హీరోల వల్లే కాదు. నిన్న ఆర్ఆర్ఆర్, పుష్ప 2కు రాని ఫుట్ ఫాల్స్ ఇరుముడికి నమోదయ్యాయి.

ఎలా చూసుకున్నా ఈ స్పీడ్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. వీక్ డేస్ లోనూ డెఫిషిట్లు లేకుండా షేర్లు వస్తున్నాయని ఎగ్జిబిటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క షో క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేనంతగా జనం దీనికి పోటెత్తుతున్నారు. టాక్సిక్ టైంలో కొంత సమస్య వచ్చినప్పటికీ దాని డిజాస్టర్ టాక్ దెబ్బకు తిరిగి థియేటర్లను ఇరుముడికి కేటాయించాల్సి వచ్చింది. కొన్ని చోట్ల నిరసనలు, ధర్నాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి.

ఈ ఘనత రవితేజ, శివ నిర్వాణ, మైత్రి మేకర్స్ ఎవరికి చెందుతుందంటే అందరికన్నా ముందు అయ్యప్ప స్వామికనేది అధిక శాతం ఆడియన్స్ వ్యక్తపరుస్తున్న అభిప్రాయం. దేవుడి లీలల మీద తీసిన సినిమా కాకపోయినా సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్, రివెంజ్ అన్ని సరైన రీతిలో మిక్స్ చేసి అయ్యప్ప మాల, ముత్యాల పల్లకి పాటని వాటికి సింక్ చేసిన తీరు జనాన్ని పోటెత్తేలా చేసింది. రవితేజ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా ఇరుముడి శాశ్వతంగా నిలవనుంది. మళ్ళీ ఎప్పటికి బ్రేక్ అవుతుందో.