2021 తొలి సినిమా సేఫ్

కొత్త ఏడాదిలో టాలీవుడ్‌కు మంచి ఆరంభాన్నే ఇచ్చింది ‘క్రాక్’. కరోనా విరామం తర్వాత పున:ప్రారంభమైన థియేటర్లకు ముందుగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ హోప్ ఇస్తే.. ‘క్రాక్’ మరింత కళను తీసుకొచ్చింది థియేటర్లకు. 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నప్పటికీ.. హౌస్ ఫుల్ బోర్డులు పెద్ద ఎత్తున పడటం ఇండస్ట్రీకి ఉత్సాహాన్నిచ్చేదే.

ఆదివారం రిలీజ్ రోజు బాక్సాఫీస్ దగ్గర అంచనాల్ని మించి పెర్ఫామ్ చేసిన ‘క్రాక్’ ఏకంగా రూ.10 కోట్లకు పైగా గ్రాస్, రూ.6 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది. కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతుండగా, థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుండగా ఈ వసూళ్లు రాబట్టడం చిన్న విషయం కాదు. రెండో రోజు సోమవారం కూడా బాక్సాఫీస్ పరీక్షకు ‘క్రాక్’ నిలబడింది. రూ.3 కోట్లకు పైగా షేర్, రూ.6 కోట్లకు అటు ఇటుగా గ్రాక్ కలెక్ట్ చేసింది.

దీంతో ‘క్రాక్’ మొత్తం షేర్ రూ.10 కోట్ల మార్కుకు చేరువైంది. బ్రేక్ ఈవెన్ కావాలంటే ‘క్రాక్’ ఇంకా రూ.6.5 కోట్ల దాకా షేర్ రాబట్టాల్సి ఉంది. మంగళవారం వసూళ్ల వివరాలు రావాల్సి ఉండగా.. రెండో రోజు సాధించిన వసూళ్లనే మూడో రోజు కూడా రాబట్టే అవకాశాలున్నాయి కాబట్టి ‘క్రాక్’ బ్రేక్ ఈవెన్ కావడానికి మంచి అవకాశాలున్నట్లే. బుధ, గురు వారాల్లో మూడు సినిమాలు వస్తుండటంతో ‘క్రాక్’ స్క్రీన్లు బాగా తగ్గిపోతాయి.

వసూళ్ల మీద కూడా ప్రభావం ఉంటుంది. కాకపోతే ఈ మాస్ మసాలా సినిమాకు రాబోయే వీకెండ్ ముగిసేలోపు రూ.3-4 కోట్ల షేర్ రాబట్టడం కష్టం కాకపోవచ్చు. కాబట్టి ‘క్రాక్’‌కు నష్టాల భయం లేదు. 2021లో రిలీజైన తొలి తెలుగు సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లడటం, ‘హిట్’ అనిపించుకోవడం ఖాయమన్నమాట. మరి మిగతా సంక్రాంతి సినిమాల సంగతేంటన్నదే చూడాలి.