సౌండు లేకుండా రేట్లు పెంచేశారే..

ఏదైనా భారీ చిత్రం విడుదలకు సిద్ధమైనపుడు.. ప్రభుత్వాలకు విన్నవించో లేదంటే కోర్టులకు విజ్ఞప్తి చేసో టికెట్ల రేట్లు పెంచుకోవడం జరుగుతుంటుంది. దీనికి సంబంధించి జీవోలు, ప్రెస్ నోట్లు కూడా రిలీజవుతుంటాయి. వీటిని ముందే సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా జనాల్ని ప్రిపేర్ చేస్తుంటారు. ఐతే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘క్రాక్’ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సౌండ్ లేకుండా టికెట్ల రేట్లు పెంచి పడేశారు. సింగిల్ స్క్రీన్లలో రూ.100గా ఉన్న టికెట్ రేటును రూ.150కి పెంచేయగా.. మల్టీప్లెక్సుల్లో రూ.150ని రెండొందలు చేశారు.

అలాగని అన్ని థియేటర్లలోనూ టికెట్ల రేట్లు పెంచారా అంటే అదీ లేదు. కొన్ని థియేటర్లలో మునుపటి రేట్లే కనిపిస్తున్నాయి. కొన్ని థియేటర్లకు మాత్రం రేట్లు పెరిగాయి. ఉదాహరణకు హైదరాబాద్‌ విషయానికొస్తే.. ప్రసాద్ మల్టీప్లెక్స్, ఏఎంబీ సినిమాస్‌లో పాత రేట్లతోనే టికెట్లు అమ్ముతున్నారు. కొన్ని సింగిల్ స్క్రీన్లలోనూ మునుపటి రేట్లే కనిపిస్తున్నాయి. కానీ మిగతా సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్సులు మాత్రం రేట్లు పెంచేశాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి. కరోనా కారణంగా థియేటర్లు దారుణంగా దెబ్బ తిన్నాయి. వాటిని నమ్ముకున్న వాళ్లందరికీ ఇబ్బంది తప్పలేదు.

ఐతే ఇప్పుడు కూడా థియేటర్లు 50 పర్సంట్ ఆక్యుపెన్సీతో నడుస్తున్న నేపథ్యంలో సినిమాను ప్రదర్శించేందుకు అవుతున్న ఖర్చు యధావిధిగా ఉంటోంది కానీ.. హౌస్ ఫుల్ అయినా వచ్చే ఆదాయం మాత్రం సగమే అవుతోంది. ఇది థియేటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు భారమే కావచ్చు. కానీ తాము కోల్పోతున్న ఆదాయాన్ని ప్రేక్షకుల నుంచి రికవర్ చేయాలని చూడటం ఎంత వరకు న్యాయం అన్నది ప్రశ్న.

కరోనా కారణంగా ప్రేక్షకులు కూడా దెబ్బ తిన్నారని, కాబట్టి ప్రభుత్వాలను ఒప్పించో, కోర్టులకు వెళ్లో టికెట్ల రేట్లు పెంచి వారిపై భారం మోపొద్దని సీనియర్ నటుడు ఆర్.నారాయణమూర్తి ఇటీవలే ఓ కార్యక్రమంలో విన్నవించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆయన వద్దన్నదే జరిగింది. అది కూడా చడీచప్పుడు లేకుండా టికెట్ల రేట్లు పెంచి ప్రేక్షకులపై భారం మోపుతున్నారు.