బోరింగ్ అన్నారు… కోట్లు ఇచ్చేస్తున్నారు

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ ‘మై వాపస్ ఆవుంగా’కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్ కూడా నెమ్మదిగా ఉంది. పోటీగా వచ్చిన కాక్ టైల్ 2 జెన్ జీ ప్రేక్షకులను టార్గెట్ చేసుకోవడంతో దాని వసూళ్లే మెరుగ్గా అనిపించాయి. అయితే క్రమంగా సీన్ మారుతోంది. నెగటివ్ వేవ్ నుంచి బయటికి వచ్చిన మై వాపస్ ఆవుంగా ప్రేక్షకులకు పెంచుకుంటోంది. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ సుమారు నలభై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు ముంబయి ట్రేడ్ రిపోర్ట్.

దీని దర్శకుడు ఇంతియాజ్ అలీ. పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’ ఒరిజినల్ వెర్షన్ ‘లవ్ ఆజ్ కల్’ తీసింది ఈయనే. ఇంతకీ కథేంటంటే 1947 ఇండియా పాకిస్థాన్ విభజన జరిగక ముందు ఇషార్ సింగ్ అనే యువకుడు ముస్లిం యువతి అఫ్సానాను ప్రేమిస్తాడు. అల్లర్ల నేపథ్యంలో ఆమె పాక్ వెళ్ళిపోతే మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని హామీ ఇచ్చి మన దేశంలో ఉండిపోతాడు. 95 ఏళ్ళ వయసులో కూడా ఈ అపరాధ భావం వెంటాడుతూనే ఉంటుంది. మనవడు నిర్వైర్ ఇదంతా తెలుసుకుని ఏం చేశాడనేది అసలు స్టోరీ.

కమర్షియల్ వాసనలు లేని హెవీ ఎమోషన్స్ ఉన్న మై వాపస్ ఆవుంగాని ఆడియన్స్ క్రమంగా సొంతం చేసుకుంటున్నారు. చాలా చోట్ల క్లైమాక్స్ అయ్యాక కళ్ళు తుడుచుకుంటూ బయటికి వస్తున్న ప్రేక్షకులు కనిపిస్తున్నారు. నిన్న చాలా మల్టీప్లెక్సుల్లో హౌస్ ఫుల్ షోలు పడ్డాయి. మా ఇంటి బంగారం వేవ్ లోనూ హైదరాబాద్ లాంటి సిటీస్ లో నో టికెట్స్ బోర్డు ఉండటం విశేషం. ఇంతియాజ్ అలీ, ఆయన ఫ్యాన్స్ ఈ స్పందన చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఇంతియాజ్ దర్శకత్వంతో పాటు నసీరుద్దీన్ షా, దిల్జీత్ దోసాంజ్, వేదాంత్ రైనా, శార్వరి నటన దీనికి ప్రాణం పోశాయి. మరో ముఖ్యమైన విషయం ఏఆర్ రెహమాన్ సంగీతం. స్లో పాయిజన్ లాగా ఆయన ఇచ్చిన పాటలు వెంటాడేలా ఉంటాయి. వీళ్ళ కాంబోలో వచ్చిన అమర్ సింగ్ చమ్కీలా తరహాలో ఇది కూడా మంచి మ్యూజిక్ తో నిలబడింది. కాకపోతే ఎంటర్ టైన్మెంట్, ఫైట్స్, ఎలివేషన్స్, ఫాస్ట్ నెరేషన్ ఆశించే రెగ్యులర్ ఆడియన్స్ ని మై వాపస్ ఆవుంగా మెప్పించడం కష్టం.