సల్మాన్ ఖాన్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని కేసు బ్లాక్ బక్ పౌచింగ్. 1998లో హం సాత్ సాత్ హై షూటింగ్ రాజస్థాన్ రాష్ట్రం జోధ్ పూర్ ప్రాంతంలో జరిగింది. అక్టోబర్ ఒకటి రెండు తేదీల్లో సల్మాన్ తో పాటు సైఫ్ అలీ ఖాన్, సోనాలి బెంద్రే తదితరులు అక్కడి అడవిలోని అరుదైన రెండు కృష్ణ జింకలను వేటాడి చంపారనే అభియోగం నమోదయ్యింది. స్థానికంగా ఉండే బిష్ణోయ్ వర్గం ఈ జింకలను పవిత్రంగా పూజిస్తారు. దీంతో పోలీస్ కేసు నమోదై బాలీవుడ్ వర్గాల్లో సంచలనం సృష్టించింది.
20 సంవత్సరాల పాటు దీని విచారణ జరిగింది. 2018లో జోధ్ పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ ని దోషిగా నిర్ధారిస్తూ అయిదు సంవత్సరాల జైలు శిక్ష, పది వేల రూపాయల జరిమానా విధించింది. మిగిలిన వాళ్ళు నిర్దోషులుగా బయట పడ్డారు. ఏప్రిల్ నెలలో రెండు రోజులు జైల్లో ఉన్న సల్మాన్ ఖాన్ తర్వాత బెయిల్ తెచ్చుకున్నాడు. 2022లో ఇది రాజస్థాన్ హైకోర్టు అప్పీల్ కు వెళ్ళింది. ఇంకా విచారణ పూర్తి కాలేదు. దశాబ్దాల తరబడి కొనసాగుతూనే వస్తోంది.
ఇప్పుడీ ఘటనను ఆధారంగా చేసుకుని కాలా హిరణ్ అనే సినిమా నిర్మాణంలో ఉంది. అమిత్ జానీ నిర్మాణంలో భరత్ దర్శకత్వంలో రూపొందించారు. పెద్దగా పేరు లేని క్యాస్టింగ్ ఇందులో నటించారు. పోస్టర్లు ఇతరత్రా ప్రమోషనల్ మెటీరియల్ తన బ్లాక్ బక్ పౌచింగ్ ని పోలి ఉండటంతో సల్మాన్ సదరు దర్శక నిర్మాతలకు ఏప్రిల్ లోనే లీగల్ నోటీసులు పంపారు. ఇంకా హియరింగ్ లోనే ఉన్న కేసు మీద సినిమా ఎలా తీస్తారనేది ఆయన అభ్యంతరం.
అయితే ప్రొడ్యూసర్ మాత్రం తాము సల్మాన్ ఖాన్ ని ఉద్దేశించి తీయలేదని, కొన్ని నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందించామని అంటున్నారు. వెనుకడుగు వేసే ఉద్దేశంలో లేమని చెబుతున్నారు. జూన్ 20 విడుదలకు రెడీ అవుతున్న కాలా హరన్ చెప్పిన టైంకి థియేటర్లకు వస్తుందా లేక కోర్టు ప్రమేయంతో బ్రేక్ వేసుకుంటుందా అనేది వేచి చూడాలి. అయినా సల్మాన్ కేసు మీద ఇంత ధైర్యంగా సినిమా తీయడం చూస్తే నిర్మాతలో మంచి బిజినెస్ యాంగిల్ కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates