తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రైమ్ ప్లేసుల్లో సింగిల్ థియేటర్లను నడుపుతున్న తమకు దీని ద్వారా వస్తున్న ఆదాయం చాలా తక్కువని.. ఆ స్థలాలను వేరే అవసరాలకు వాడితే అంతకు కొన్ని రెట్ల డబ్బు వస్తుందని.. అయినా సినిమా మీద ప్రేమతో తాము సింగిల్ స్క్రీన్లను నడుపుతుంటే.. తమకు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర అన్యాయం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పర్సంటేజీ విధానం అమలు చేస్తే.. ఎంత ఆదాయం వస్తే అందులోంచి ఎవరి కష్టానికి తగ్గట్లు వాళ్లు ఫలితం పొందుతారని ఎగ్జిబిటర్లు అంటున్నారు. ఏపీలో కూడా ఎగ్జిబిటర్ల వాదన ఇలాగే ఉంది. గత ఏడాది ఒక దశలో సమ్మెకు కూడా సిద్ధమైన ఎగ్జిబిటర్లు.. తర్వాత వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
ఐతే ఇప్పుడు ఏషియన్ సునీల్, ఎస్వీసీ శిరీష్ లాంటి పెద్ద వ్యక్తుల ఆధ్వర్యంలో తెలంగాణ ఎగ్జిబిటిటర్లు మీడియాకు ముందుకు వచ్చి, పర్సంటేజీ విధానం అమలు చేయకపోతే థియేటర్లు ఇచ్చేది లేదని తేల్చేశారు.
ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఏషియన్ సునీల్ ఎగ్జిబిటర్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో వెల్లడిస్తూ ఒక షాకింగ్ విషయం వెల్లడించారు. ఒక పెద్ద సినిమాకు అర్ధరాత్రి ఒంటి గంటకు స్పెషల్ షో వేస్తే.. దానికి రూ.400 టికెట్ రేటు పెట్టారని, ఆ షో ద్వారా డిస్ట్రిబ్యూటర్కు రూ.4 లక్షల ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. కానీ అందులోంచి థియేటర్ యజమానికి వచ్చిన ఆదాయం కేవలం రూ.10 వేలే అని ఆయన వెల్లడించారు.
ఆ పదివేలు కూడా పోలీసులకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని.. ఇక ఎగ్జిబిటర్కు ఏం మిగులుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ స్పెషల్ షోలు వేయకుంటే.. మిగతా షోలు థియేటర్లో ఆడనివ్వరని, అందుకే వీటి వల్ల ఎగ్జిబిటర్లకు పెద్దగా ఒరిగేదేమీ లేకపోయినా ఆ షోలను నడిపించాల్సి వస్తుందని.. మొత్తం ఎగ్జిబిటర్ల పరిస్థితి ఘోరంగా ఉందని ఆయనన్నారు.
తెలంగాణలో ఇకపై ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా, ఇకపై సింగిల్ స్క్రీన్లలో రేట్లు పెంచబోమని ఈ సందర్భంగా ఎగ్జిబిటర్లు ప్రకటించగా.. ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోవడానికి అధిక టికెట్, తినుబండారాల ధరలు కారణమని సునీల్ స్పష్టం చేశారు.
కొన్ని మామూలు సినిమాలకు కూడా మల్టీప్లెక్సుల్లో రూ.295 రేటును రూ.400కు పెంచడం ప్రతికూలమైందని.. తమ ఏషియన్ మూవీస్లో పాప్ కార్న్ 60 రూపాయలకు ఇస్తుంటే, చాలా మల్టీప్లెక్సుల్లో అది రూ.300 అంతకంటే ఎక్కువ రేటు ఉంటోందని.. దీని వల్లే ఆడియన్స్ థియేటర్లకు రావట్లేదని సునీల్ అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates