ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య రిలీజవుతోంది జెట్లీ సినిమా. ఐతే హైదరాబాద్లో టాప్ మల్టీప్లెక్స్ ఛైన్స్ అయిన ఏఎంబీ, ఏఏఏ, ఏఆర్టీ లాంటి థియేటర్లలో ఈ సినిమా విడుదల కావట్లేదు. ఇంకా చాలా వరకు సింగిల్ స్క్రీన్స్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించట్లేదు. ఇటు ఏషియన్ మూవీస్ సునీల్ నారంగ్ నేతృత్వంలోని థియేటర్లు, అటు దిల్ రాజు సంస్థ ఎస్వీసీకి చెందిన స్క్రీన్లలో ఈ సినిమాను నిషేధించారు. రెవెన్యూ షేరింగ్ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
మైత్రీ వాళ్లకు కొన్నేళ్ల నుంచి ఎస్వీసీ, ఏషియన్ వాళ్లతో డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ విషయంలో గొడవలు నడుస్తున్నాయి. వీళ్ల ఏకఛత్రాధిపత్యానికి చెక్ పెడుతూ మైత్రీ సంస్థ సొంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు పెట్టుకుంది. అంతే కాక సింగిల్ స్క్రీన్లను కొంటోంది. ఐతే దిల్ రాజు, సునీల్ నారంగ్ లాంటి టాప్ ఎగ్జిబిటర్లు కలిసి ఇటీవల 60-50-40 పద్ధతిలో రెవెన్యూ షేరింగ్ ప్రతిపాదన చేశారు. దాని విషయంలో ఇండస్ట్రీ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇది తమకు సమ్మతం కాదని కొందరు నిర్మాతలు తేల్చి చెప్పారు. కానీ ఎగ్జిబిటర్లు ఆ పద్ధతినే అనుసరిస్తామంటున్నారు. ఐతే మైత్రీ సంస్థ జెట్లీ మూవీకి అలా రెవెన్యూ షేర్ చేయడానికి నిరాకరించడంతో జెట్లీ సినిమాను తమ స్క్రీన్లలో ప్రదర్శించకూడదని ఏషియన్ మూవీస్, ఎస్వీసీ సంస్థలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మామూలుగా కొత్త సినిమాలు రిలీజవుతుంటే.. నిర్మాతలు రాజీ పడి ఎగ్జిబిటర్ల డిమాండ్లకు తలొంచుతుంటారు. కానీ మైత్రీ సంస్థ మాత్రం అలా చేయడం లేదు. ఇంతకుముందు పుష్ప-2 సినిమా విషయంలోనూ ప్రసాద్ మల్టీప్లెక్స్తో రెవెన్యూ షేరింగ్ విషయంలో గొడవ జరిగి అక్కడ ఆ చిత్రం ప్రదర్శితం కాలేదు.
కారణాలు ఏవైనా సరే.. తరచుగా మైత్రీ వాళ్ల సినిమాలు రిలీజ్ ముంగిట సమస్యలు ఎదుర్కొంటుండడం హీరోల అభిమానుల అసంతృప్తికి కూడా దారి తీస్తోంది. మైత్రీ రిలీజ్ చేసిన సలార్, రాజాసాబ్.. ఆ సంస్థ ప్రొడ్యూస్ చేసిన పుష్ప-2 లాంటి భారీ చిత్రాలకు కూడా తలనొప్పులు తప్పలేదు. ఇప్పుడు జెట్లీ సినిమా పరిస్థితి చూస్తుంటే.. ఈ సంస్థ నుంచి రాబోయే పెద్ది, ఫౌజీ, డ్రాగన్ లాంటి భారీ చిత్రాల పరిస్థితి ఏమవుతుందో అని ఆయా చిత్రాల అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates