జేడీ వదులుకున్న కల్ట్ బ్లాక్‌బస్టర్

ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన సినిమాలు కొన్నిసార్లు బ్లాక్ బస్టర్లు అయి.. ఆ హీరోలు చింతించేలా చేస్తుంటాయి. అదే సమయంలో కొన్ని చిత్రాలు డిజాస్టర్లు అయి హమ్మయ్యే అనుకునేలానూ చేస్తుంటాయి. తన కెరీర్లో తాను మిస్సయ్యానని ఫీలయ్యే సినిమాలు రెండు ఉన్నట్లు సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

తమిళంలో తరతరాలు నిలిచిపోయే కల్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా ‘సేతు’ చిత్రాన్ని చెప్పొచ్చు.
సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడిగా విక్రమ్ ఎదగడానికి పునాది వేసిన చిత్రమిది. గ్రేట్ డైరెక్టర్ బాలకు ఇదే తొలి సినిమా. ఈ చిత్రానికి ముందు జేడీ చక్రవర్తినే అడిగాడట బాల. కానీ కొన్ని కారణాల వల్ల తాను ఆ సినిమా చేయలేకపోయానని.. అది మిస్సయినందుకు తర్వాత తాను ఫీలయ్యానని జేడీ తెలిపాడు. ఒకవేళ జేడీ ఆ సినిమా చేసి ఉంటే తమిళంలో అతను పెద్ద స్టార్ అయిపోయేవాడేమో. తన కెరీరే మరోలా ఉండేదేమో.

ఇక తెలుగులో తాను మిస్సయిన సినిమాల్లో ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ ముఖ్యమైందిగా చెప్పుకొచ్చాడు జేడీ చక్రవర్తి. ఆ సినిమాను నిర్మించింది తనకు క్లోజ్ ఫ్రెండ్ అయిన శేషు రెడ్డే అని.. ఇక దర్శకుడు జగన్ కూడా తనకు సన్నిహితుడే అని.. కానీ ఆ సినిమా చేయాల్సిన టైంలోనే తాను బొంబాయికి వెళ్లాల్సి ఉండడంతో దాన్ని మిస్సయ్యానని జేడీ తెలిపాడు.

ఐతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు రఘు కుంచే మాట్లాడుతూ.. ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రానికి రవితేజను కాకుండా వేరే హీరోను పెట్టుకోమని అంటే, పూరి ససేమిరా అన్నట్లు వెల్లడించాడు. బహుశా నిర్మాత జేడీనే సజెస్ట్ చేశాడేమో. పూరి మాత్రం రవితేజతోనే వెళ్లాలని అనుకున్నట్లున్నాడు.

ఇదిలా ఉండగా.. ‘శివ’ సినిమాలో పోస్టర్ మీద చైన్ పట్టుకున్నట్లుగా ఉండే చేయి నాగార్జునది కాదని, తనది అని జేడీ చెప్పడం విశేషం. జేడీ విలన్ పాత్ర పోషించిన ‘గాయపడ్డ సింహం’ మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.