హిట్టిస్తే గుడి కట్టేస్తారు

బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది సల్మాన్ ఖానే. ఆయన నిఖార్సయిన బ్లాక్‌బస్టర్ కొట్టి దశాబ్దం కావస్తోంది. 2016లో వచ్చిన ‘సుల్తాన్’ తర్వాత ఆయనకు ఆ స్థాయి విజయం దక్కలేదు. ‘టైగర్ జిందా హై’ మాత్రమే ఒక మాదిరిగా ఆడింది.

గతంలో సల్మాన్ సినిమా ఎలా ఉన్నప్పటికీ భారీ ఓపెనింగ్స్ వచ్చేవి. కానీ ఈ మధ్య అదీ జరగట్లేదు. గత ఏడాది ‘సికందర్’ ఎంత ఘోరమైన ఫలితాన్ని అందుకుందో తెలిసిందే. సల్మాన్ సినిమా అంటే ఆడియన్స్ లైట్ తీసుకుంటున్నారు.

ఆయన అభిమానులు కూడా పెద్దగా ఎగ్జైట్ కాని పరిస్థితి వచ్చేసింది. ప్రస్తుతం మేకింగ్ దశలో ఉన్న ‘మాతృభూమి’ డిజాస్టర్ కాబోతోందని ముందే ఒక అంచనాకు వచ్చేశారంటే సిచువేషన్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖాన్ త్రయంలో మిగతా ఇద్దరూ షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ పరిస్థితి కూడా మధ్యలో దయనీయంగా కనిపించింది కానీ.. వాళ్లిద్దరూ పుంజుకున్నారు. ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలు షారుఖ్‌కు లైఫ్ ఇస్తే.. ‘సితారే జమీన్ పర్’తో ఆమిర్ ఉపశమనం పొందాడు.

కానీ సల్మాన్ పరిస్థితే అగమ్య గోచరంగా ఉంది. ఇలాంటి టైంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి.. భాయ్‌తో జట్టు కట్టాడు. వంశీకి దర్శకుడిగా తొలి ఛాన్స్ ఇచ్చాక వరుసగా అతడితో సినిమాలు తీస్తున్న దిల్ రాజే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ప్రస్తుతం సల్మాన్ ఫ్యాన్స్ ఆశలన్నీ వంశీ మీదే ఉన్నాయి. భాయ్‌కి హిట్ ఇస్తే గనక అభిమానులు అతడికి గుడి కట్టేస్తారనడంలో సందేహం లేదు.

కానీ వంశీ రొటీన్ సినిమాలకు పెట్టింది పేరు. ఫ్రెంచ్ మూవీని రీమేక్ చేసిన ‘ఊపిరి’ని మినహాయిస్తే తన సినిమాలన్నీ వేరే చిత్రాల నుంచి ఇన్‌స్పైర్ అయినట్లే ఉంటాయి.
విజయ్‌తో తీసిన చివరి చిత్రం ‘వారిసు’ కూడా అలాంటి కోవకు చెందిందే. విజయ్‌‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, అతడి ఫామ్ కారణంగా ఆ సినిమా ఆడేసింది కానీ.. అదొక సాధారణ చిత్రం అనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం హిందీ ప్రేక్షకులు ఉన్న మూడ్‌లో అలాంటి సినిమానే ఇంకోటి తీస్తే మాత్రం కష్టమే. సల్మాన్ ప్రేక్షకులను గ్రాంటెడ్‌గా తీసుకుని రొటీన్ సినిమాలు తీయడం వల్లే పతనం చూశాడు. కాబట్టి వంశీ కొత్తగా ఏదో ట్రై చేసి, ఆశ్చర్యపరిస్తే తప్ప బాక్సాఫీస్‌ను గెలవలేడు. మరి అతనేం చేస్తాడో చూడాలి.