ర‌వితేజ‌ను త‌ప్పించ‌డానికి ఒప్పుకోని పూరి

బద్రి లాంటి సూప‌ర్ హిట్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు పూరి జ‌గ‌న్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ ప‌డిందంటే ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని అనుకుంటాం. కానీ రెండో సినిమా బాచితో పెద్ద డిజాస్ట‌ర్ ప‌డ‌డంతో పూరి ప‌రిస్థితి మొద‌టికి వ‌చ్చింది. ఆ ప‌రిస్థితుల్లో త‌న‌తో పాటు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసిన రోజుల్లో ప‌రిచ‌యం ఉన్న ర‌వితేజ‌ను హీరోగా పెట్టి ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌హ్మ‌ణ్యం చేశాడు.

అది హిట్ట‌యి పూరిని ద‌ర్వ‌కుడిగా నిల‌బెట్టింది. ఆపై వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఇడియ‌ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో పూరికి తిరుగులేక‌పోయింది. ఐతే ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌హ్మ‌ణ్యం సినిమాకు హీరోగా ర‌వితేజను నిర్మాత ఒప్పుకోలేద‌ట‌. క్రేజ్, మార్కెట్ ఉన్న హీరోను ఎంచుకుందామ‌ని అన్నాడట‌. కానీ పూరి మాత్రం ఒప్పుకోనేలేద‌ట‌. తీస్తే ర‌వితేజ‌తోనే ఈ సినిమా తీస్తా, లేదంటే ఈ సినిమానే తీయ‌ను అని ఖ‌రాఖండిగా చెప్పేశాడ‌ట‌.

ఈ విష‌యాన్ని పూరికి క్లోజ్ ఫ్రెండ్ అయిన గాయ‌కుడు, సంగీత ద‌ర్శ‌కుడు, న‌టుడు ర‌ఘు కుంచే వెల్ల‌డించాడు. తాను లీడ్ రోల్ చేసిన గేదెల రాజు సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా మీడియాను క‌లిసిన సంద‌ర్భంగా ర‌ఘు ఈ సంగ‌తి చెప్పాడు. కృష్ణ‌వంశీ.. బ్ర‌హ్మాజీని హీరోగా నిల‌బెట్టాల‌ని సింధూరం సినిమా తీశాడ‌ని.. కానీ ఆశ్చ‌ర్య‌క‌రంగా దాని వ‌ల్ల ర‌వితేజ‌కు ఎక్కువ పేరొచ్చింద‌ని ర‌ఘు అన్నాడు.

కానీ సింధూరం సినిమా కోసం ర‌వితేజ మామూలుగా క‌ష్ట‌ప‌డ‌లేద‌ని.. ఫిట్‌గా ఉండాల‌ని విప‌రీతంగా ప‌రుగులు తీస్తూ ఉండేవాడ‌ని ర‌ఘు గుర్తు చేసుకున్నాడు. ర‌వితేజ‌కు బ్రేక్ ఇచ్చిన ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌హ్మ‌ణ్యం సినిమాకు నిర్మాత వేరే హీరోను చూద్దామ‌న్నా.. పూరి మాత్రం అందుకు స‌సేమిరా అని త‌న‌తోనే సినిమా తీసిన‌ట్లు ఈ సంద‌ర్భంగా చెప్పాడు.

ర‌వితేజ కెరీర్లో నా ఆటోగ్రాఫ్, నేనింతే చాలా మంచి సినిమాల‌ని.. కానీ వాటితో ప్రేక్ష‌కులు రిలేట్ కాక‌పోవ‌డంతో అవి స‌రిగా ఆడ‌లేద‌ని.. ముఖ్యంగా నేనింతే సినిమాతో ఫిలి ఇండ‌స్ట్రీ బాగా క‌నెక్ట్ అయినా, మీ సినిమావాళ్ల బాధ‌లు మాకెందుకు అని జ‌నం ఆ సినిమా చూడ‌లేద‌ని అన్నాడు ర‌ఘు. గేదెల రాజు ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.