రజినీకాంత్ సినిమాకు దర్శకుల కష్టాలు

అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే మల్టీస్టారర్ కు ముందు లోకేష్ కనగరాజ్ ని దర్శకుడిగా అనుకున్నారు. తీరా చూస్తే కొన్నిరోజుల తర్వాత కూలి ఫలితం వచ్చాక ఆ ప్రాజెక్టు గురించి కొత్త ట్విస్టు జరిగింది. అటు ఇటు తిరిగి ఏవేవో పేర్లు వినిపించాక ఏవేవో చర్చలు జరిగాక చివరికి ఆ ఛాన్స్ జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ కు దక్కింది.

ఇది కాకుండా కమల్ బ్యానర్ లోనే రజని సోలో హీరోగా మరో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తలైవర్ 173 వర్కింగ్ టైటిల్ తో ఆ మధ్య అధికారిక ప్రకటన ఇచ్చారు. ముందు సుందర్ సి చేరారు. కానీ ఆయన హఠాత్తుగా తప్పుకున్నారు. తర్వాత శివ కార్తికేయన్ కు కాలేజీ డాన్ లాంటి హిట్ ఇచ్చిన శిబి చక్రవర్తి పేరుని లాక్ చేశారు. కానీ ఇప్పుడు అతని స్థానంలో అశ్వత్ మారిముత్తు రానున్నారని కొత్త టాక్ వినిపిస్తోంది. ఖచ్చితమైన సమాచారం లేదు కానీ అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలు దాన్నే సూచిస్తున్నాయని వినికిడి.

కోలీవుడ్ వర్గాలు ఇంకో కొత్త వెర్షన్ చెబుతున్నాయి. గతంలో శిబి చక్రవర్తి నానితో ఒక మూవీ చేయాలని హీరో, నిర్మాణ సంస్థని ఒప్పించి హైదరాబాద్ లో ఆఫీస్ తీశారు. కొన్ని నెలల తర్వాత అది ఆగిపోయింది. కానీ ఆలోగానే ప్రీ ప్రొడక్షన్ ఖర్చు అయిదు కోట్లకు చేరుకుందట. దాన్ని వెనక్కు ఇమ్మని సదరు నిర్మాతలు డిమాండ్ చేయడంతో ఫైనల్ గా కోటిన్నర ఇచ్చే విధంగా శిబి సెటిల్ మెంట్ చేసుకున్నాడని అంటున్నారు. ఈ గాసిప్ నిజానిజాలు పెరుమాళ్ళకెరుక.

లాల్ సలామ్, కూలీ ఫెయిలయ్యాక రజని కొంచెం స్లో అయ్యారు. జైలర్ 2 కూడా పరుగులు పెట్టడం లేదు. క్యామియోలకు సరైన స్టార్ హీరోలు దొరక్క కొంత ఆలస్యమవుతోంది. ఏడు పదుల వయసు దాటిపోయిన నేపథ్యంలో ఇకపై చేయబోయే సినిమాల విషయంలో రజని చాలా కఠినంగా ఉంటున్నారట. స్క్రిప్ట్ ఏ దశలో నచ్చకపోయినా సారీ చెప్పేసి పంపిస్తున్నారట. అందులో భాగంనే ఇన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఫైనల్ గా ఎవరుంటారో వెయిట్ అండ్ సీ.