తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్ గా మారిపోగా మరికొన్ని అదే దారిలో వెళ్లే రిస్కులో ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సినీ ప్రియులు దేవాలయాలుగా భావించే వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత పరిశ్రమ మీద ఉంది. అయితే చాలా సంవత్సరాలుగా ఇవి రెంటల్ పద్దతిలో నడుస్తున్నాయి. అంటే బ్లాక్ బస్టర్ వచ్చినా ఫ్లాప్ మూవీ వేసినా రెవిన్యూ ఒకటే ఉంటుంది. ఏ పెంపు ఉండదు.
డిస్ట్రిబ్యూటర్ లేదా నిర్మాత అద్దె ఇచ్చి థియేటర్లో వేసుకునే సినిమాల కలెక్షన్లు తాను చూసుకుంటాడు. ఇప్పుడు పర్సెంటేజ్ సిస్టంలోకి మారడం వల్ల ఇద్దరికీ లబ్ది చేకూరుతుంది. ఉదాహరణకు ఒక స్క్రీన్ అద్దె లక్ష అనుకుందాం. ఒకవేళ కలెక్షన్ అయిదు లక్షలు వచ్చినా ఓనర్ కు ప్రయోజనం ఉండదు. కానీ పర్సెంటేజ్ విధానం వల్ల ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ ముందే నిర్ణయించుకున్న నిష్పత్తి ప్రకారం వసూళ్లు పంచుకుంటారు. అంటే రెట్టింపు ఆదాయం వచ్చే ఛాన్స్ థియేటర్ ఓనర్ కు ఉంటుంది.
హైదరాబాద్ లో ఉన్న 23 సింగల్ స్క్రీన్ థియేటర్లు ఈ పద్ధతిలోకి రేపటి నుంచి మారబోతున్నాయి. మొదటివారం డిస్ట్రిబ్యూటర్ 60 శాతం – ఎగ్జిబిటర్ 40 శాతం తీసుకుంటే రెండో వారం అది 50 – 50 మోడల్ లోకి వెళ్తుంది. మూడో వారం నుంచి ఎగ్జిబిటర్ కు 60 శాతం మిగిలిన 40 శాతం పంపిణీదారుడు తీసుకుంటాడు. టికెట్ హైక్స్ ఉన్నప్పుడు ఇందులో స్వల్ప మార్పులు ఉంటాయి. దీని వల్ల సింగల్ స్క్రీన్ యజమానుల ఆదాయం పెరగబోతోంది.
దీని వల్ల ఇబ్బందులు లేవా అంటే ఉన్నాయి. ఒకవేళ ఏదైనా డిజాస్టర్ పడ్డప్పుడు థియేటర్ ఓనర్ కు అద్దె డబ్బులు కూడా వసూలు కాకపోవచ్చు. అప్పుడా నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. హిట్టు బొమ్మ పడిందా రెట్టింపుకి మించిన లాభాలు ఉంటాయి. త్వరలోనే ఈ పద్దతిని నైజామ్ వ్యాప్తంగా విస్తరించే విధంగా ప్రణాళికలు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వైపు కూడా ఇలాంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. మల్టీప్లెక్సులు ఎన్ని ఉన్నా సింగల్ స్క్రీన్లు ఇచ్చే కిక్కు వేరుగా ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
