దిల్ రాజు.. ఒకే రోజు ఐదు సినిమాల‌తో

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు క‌రోనా విరామం త‌ర్వాత య‌మ జోరుమీదున్నారు. ఆయ‌న ప్రొడ‌క్ష‌న్లో ప్ర‌స్తుతం ఐదు సినిమాలు తెర‌కెక్కుతుండ‌టం విశేషం. ఆ ఐదూ ఒకే రోజు షూటింగ్ జ‌రుపుకోవ‌డం గ‌మ‌నార్హం. బుధ‌వారం రాజు సినిమాలు వివిధ లొకేష‌న్ల‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్నాయి.

అందులో ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సింది ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ మూవీ గురించి. ప‌వ‌న్‌తో సినిమా చేయాల‌న్న‌ది రాజుకు ఎన్నో ఏళ్లుగా క‌ల‌. ఎట్ట‌కేల‌కు అది నెర‌వేరింది. క‌రోనా బ్రేక్ త‌ర్వాత ఈ చిత్రం నిర్విరామంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ప‌వ‌న్ కూడా ఈ మ‌ధ్య రెగ్యుల‌ర్‌గా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. బుధ‌వారం కూడా ఆయ‌న సెట్స్‌లో ఉన్నాడు.

మ‌రోవైపు ఇటీవ‌లే అనౌన్స్ అయిన ఎఫ్‌-2 సీక్వెల్ ఎఫ్‌-3 సైతం బుధ‌వార‌మే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్టుకుంది. హీరో వెంక‌టేష్‌తో క‌లిసి ద‌ర్శ‌కుడు ఆన్ లొకేష‌న్ ఫొటో దిగి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు కూడా. అలాగే ఇటీవ‌లే నాగ‌చైత‌న్య హీరోగా విక్ర‌మ్ కుమార్ థ్యాంక్ యూ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్టాడు. అది కూడా రాజు సినిమానే.

ఇవి కాక రెండు చిన్న సినిమాలు రాజు లైన్లో పెట్టాడు. అందులో ఒక‌టి.. పాగ‌ల్. విశ్వ‌క్సేన్ హీరోగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని బెక్కెం వేణుగోపాల్‌తో క‌లిసి రాజు నిర్మిస్తున్నాడు. అలాగే హుషారు ఫేమ్ హ‌ర్ష ద‌ర్శ‌క‌త్వంలోనూ రాజు ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇలా రాజు నిర్మాణంలోని ఈ ఐదు సినిమాలూ ఒకే స‌మ‌యంలో సెట్స్ మీద ఉన్నాయి. క‌రోనా క‌ష్ట‌కాలంలో ఓ నిర్మాత ఇలా ఐదు సినిమాలు ఒకేసారి ప్రొడ్యూస్ చేయ‌డం చిన్న విష‌యం కాదు. అందుకే దిల్ రాజు అగ్ర‌నిర్మాత‌గా కొన‌సాగుతున్నాడు.