ప్రకాష్ రాజ్ బీఫ్ కామెంట్లపై దుమారం

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంటే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఉన్న వ్యతిరేకత ఎలాంటిదో తెలిసిందే. ‘జస్ట్ ఆస్కింగ్’ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి తరచుగా మోడీ సర్కారు మీద విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తుంటాడు ప్రకాష్ రాజ్. ఐతే పాలన, విధానాల విషయంలో ఎన్ని విమర్శలు చేసినా ఓకే కానీ.. కొన్నిసార్లు వ్యక్తిగత స్థాయిలోకి వెళ్లిపోతుంటాయి.

అంతే కాక ముస్లింల మనోభావాలు, వారి భద్రత గురించి మాట్లాడే ప్రకాష్ రాజ్.. బీజేపీ హిందుత్వ విధానాన్ని తప్పుబట్టే క్రమంలో హిందువుల మనోభావాలను గాయపరిచేలా వ్యాఖ్యలు చేస్తుంటారు. పోస్టులు పెడుతుంటారు. ప్రకాష్ రాజ్ విమర్శలు, ఆరోపణలు, కామెంట్లు అన్నీ కూడా సెలెక్టివ్‌గా ఉంటాయన్నది ఎక్కువమంది చేసే విమర్శ.

ఇటీవల చర్చనీయాంశంగా మారిన ‘కేరళ స్టోరీ-2’ ట్రైలర్ మీద సెటైర్ వేస్తూ ఆయన తాజాగా పెట్టిన పోస్టు దుమారం రేపుతోంది. ఈ ట్రైలర్లో ఒక హిందూ మహిళతో ముస్లింలు అత్యాచారం జరిపి, బలవంతంగా బీఫ్ తినిపించినట్లు చూపించారు. దీనికి కౌంటర్‌గా ప్రకాష్ రాజ్.. రియల్ కేరళ స్టోరీ ఇది అంటూ ఆ రాష్ట్రంలో బీఫ్ ఎంత బాగా వండుతారో, ఆ వంటకాలు ఎంత రుచికరంగా ఉంటాయో చెబుతూ ఒక పోస్టు పెట్టాడు.

ఐతే ‘కేరళ స్టోరీ-2’లో అభ్యంతరకర అంశాలు ఉంటే.. వాటిని తప్పుబట్టాలి, అవి నిజం కాదని వాదించాలి కానీ.. హిందువులు గోవును పవిత్రంగా చూస్తారనే విషయం తెలిసి కూడా గోమాంసం మీద ఇలా రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బీజేపీని టార్గెట్ చేసే క్రమంలో హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఈ కామెంట్లు, పోస్టులు ఏంటి అని ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడూ హిందూ మతంలో తప్పులను ఎత్తి చూపడమే కాక హిందువుల మనోభావాలను గాయపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టే ప్రకాష్ రాజ్.. ఎప్పుడైనా ఇస్లాం, క్రిస్టియన్ మతాల్లో తప్పులను ఎత్తి చూపారా అని నెటిజన్లు ఆయన తీరును దుయ్యబడుతున్నారు.