రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ గురించి కూడా మొదలైనపుడు చాలా ధీమాగా స్టేట్మెంట్ ఇచ్చారు జక్కన్న. 2020 పక్కాగా సినిమా రిలీజవుతుందని ధీమాగా చెప్పారు. తీరా చూస్తే.. కరోనా సహా పలు కారణాల వల్ల ఆ చిత్రం 2022లో కానీ రిలీజ్ కాలేదు. ఆ సినిమా విడుదలప్పుడు ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తన మీద వచ్చిన మీమ్స్ చూసి పగలబడి నవ్వాడు రాజమౌళి.
‘ఆర్ఆర్ఆర్’ కంటే ముందు బాహుబలి, ఈగ చిత్రాలు సైతం అనుకున్న దాని కంటే చాలా ఆలస్యం అయ్యాయి. ఇప్పుడిక వర్తమానంలోకి వస్తే రాజమౌళి కొత్త చిత్రం ‘వారణాసి’కి చాలా ముందుగానే రిలీజ్ డేట్ ఖరారు చేశారు. గత ఏడాది టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసినపుడు 2027 సమ్మర్ రిలీజ్ అని ప్రకటించిన చిత్ర బృందం.. ఇటీవలే ఏప్రిల్ 7 అంటూ డేట్ కూడా ఇచ్చేసింది.
కానీ ఆ టైంకి పక్కాగా సినిమా వస్తుందా అనే విషయంలో అనుమానాలతోనే ఉన్నారు ప్రేక్షకులు. కానీ ఈసారి పర్ఫెక్ట్ ప్లానింగ్తోనే టీం రంగంలోకి దిగినట్లుంది. సినిమా విడుదలకు 8 నెలల ముందే బ్యాగ్రౌండ్ స్కోర్ పనులు మొదలు కానున్నాయట. తాను ఈ ఏడాది సెప్టెంబరు నుంచే ‘వారణాసి’కి బీజీఎం చేయడం మొదలుపెట్టబోతున్నట్లు సంగీత దర్శకుడు కీరవాణి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఆయన ఇంత ముందుగా బీజీఎం పని మొదలుపెడుతున్నారంటే అప్పటికి ఆయన చేతికి ఔట్ పుట్ అంతా వచ్చేస్తుందన్నమాట. భారీగా విజువల్ ఎఫెక్ట్స్, ప్రి ప్రొడక్షన్ వర్క్ ముడిపడ్డ సినిమా ‘వారణాసి’. కాబట్టి విడుదలకు చాలా ముందుగానే చిత్రీకరణ పూర్తి కావాలి. ఆ దిశగానే జక్కన్న అండ్ టీం అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఈ ఏడాది మధ్యకల్లా షూట్ ఒక కొలిక్కి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణతో పాటే వీఎఫెక్స్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అన్నీ ప్లాన్ ప్రకారమే నడుస్తున్నాయి కాబట్టి ఈసారి చెప్పిన రిలీజ్ డేట్కు జక్కన్న కట్టుబడితే ఆశ్చర్యం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates