సాగర సంగమం తీయలేదు నిజమే కానీ

నిర్మాత నాగవంశీకి మరోసారి అసహనం కలిగింది. ఇవాళ విడుదలైన ఫంకీ స్పందన గురించి మాట్లాడుతూ ఏదో ట్విట్టర్ సైంటిస్టుల్లా ఇందులో కథ లేదని కొందరు కనుక్కున్నారని, సీన్ల మీద స్టోరీ రాశామని అన్నారని, కానీ స్టోరీ గట్రా ఆశించకుండా ఊరికే నవ్వుకోవడానికి రమ్మని తాము ముందే క్లారిటీ ఇచ్చామని మొన్నటి ప్రసంగాన్ని గుర్తు చేశారు.

నేనేం సాగరసంగమం తీయలేదు కదాని పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చారు. నిజానికి ఆయన ఉద్దేశం ఏదైనా ఇలాంటి కామెంట్స్ నెగటివిటీని పెంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తప్ప పాజిటివిటీని కాదు. ఎందుకంటే ఎలా తీసినా తమ సినిమాని తాము చులకన చేసుకోకూడదనేది ఓపెన్ ఫ్యాక్ట్.

కంటెంట్ ఏదైనా స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు దానికి సినిమాటిక్ ఫ్లేవర్ ఖచ్చితంగా ఉండాలి. గ్లామర్. గ్రామర్ లేకుండా తీశామని చెప్పడం తేలికే కానీ ఆడియన్స్ దాన్ని అంత లైట్ గా తీసుకోరు. ఎందుకంటే టికెట్ కొని థియేటర్ లోపలికి వచ్చాక వాళ్లకు రకరకాల అంచనాలు ఉంటాయి. వాటిని కనీస స్థాయిలో అందుకోవాల్సి ఉంటుంది.

అలా కాకుండా మా ఇష్టం వచ్చినట్టు తీశాం, ముందే చెప్పాం కదా అంటే సరిపోదు. ఎందుకంటే జాతిరత్నాలులో కేవలం కామెడీ లేదు. సరదాగా ఉంటూనే బ్యాక్ గ్రౌండ్ లో చిన్న క్రైమ్ అండ్ పొలిటికల్ ఎలిమెంట్ ఉంటుంది. ఫ్లాప్ అయినా ప్రిన్స్ లో కూడా చెప్పుకోదగ్గ పాయింట్ ఉంది.

అలాంటప్పుడు ఫంకీ మీద ఎక్స్ పెక్టేషన్ పెట్టుకోవడం తప్పేమీ కాదు. మిక్స్డ్ రెస్పాన్స్ వల్ల ఫంకీ టీమ్ కాస్త ఫంక్ అవుతున్నట్టు ఉంది. ఇప్పుడు నడుస్తున్నది ఎంటర్ టైన్మెంట్ ట్రెండ్ అయినప్పటికీ ఆ ఫన్ కూడా లాజిక్స్ కు లోబడి మేజిక్ చేయాలనేది ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్న డిమాండ్.

ఈ విషయంలో అనిల్ రావిపూడి గ్రిప్పు తెచ్చుకున్నాడు కాబట్టే ప్రతి ఏడాది బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. అనుదీప్ కు కూడా అలాంటి సత్తా లేదని చెప్పలేం. కాకపోతే సరైన హోమ్ వర్క్ జరగాలి. వీకెండ్ అయ్యాక ఫంకీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుంటుందో క్లారిటీ వస్తుంది. వసూళ్లు చూశాక ఒక స్పష్టతకు రావొచ్చు.