ట్రోలింగ్ నేర్పిస్తున్న కొత్త పాఠం

అనుకున్నట్టే రాజా సాబ్ ఓటిటిలో వచ్చాక ట్రోలింగ్ మరింత ఎక్కువయ్యింది. మాములుగా హాట్ స్టార్ లాంటి హై స్టాండర్డ్ ఓటిటిలో స్క్రీన్ షాట్లు, వీడియో క్లిప్స్ కట్ చేయడం అసాధ్యం. కానీ ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకేసి పైరసీ సైట్ల నుంచి హెచ్డి ప్రింట్లు డౌన్లోడ్ చేసుకుని వాటి ద్వారా దర్శకుడు మారుతీని టార్గెట్ చేస్తున్నారు.

ఫలానా ఫైట్లో ప్రభాస్ డూప్ ఉన్నాడని, ఒక సన్నివేశంలో రాత్రి చూపించిన బస్సు ఉదయానికి మారిపోయిందని, ఇంకో సీన్లో మాళవిక మోహనన్ రోడ్డు చూడకుండా కార్ డ్రైవ్ చేసిందని ఇలా రకరకాలుగా పోస్ట్ మార్టం చేసి ఆడుకుంటున్నారు. ట్రోల్స్ పక్కనపెడితే ఇక్కడో ముఖ్యమైన కోణం చూడాలి

గతంలో ఇంత కన్నా డిజాస్టర్లు వచ్చాయి. గేమ్ ఛేంజర్ విషయంలో శంకర్ ని కూడా మూవీ లవర్స్ క్షమించలేదు. లైగర్, ఆచార్య దెబ్బకు కొందరు డిస్ట్రిబ్యూటర్లు వేరే బిజినెస్ లకు వెళ్లిపోయారు. ఇలా తవ్వుకుంటూ పోతే కొన్ని వందల ఉదాహరణలు కనిపిస్తాయి.

మరి వాటికి జరగని దారుణమైన ట్రీట్ మెంట్ రాజా సాబ్ కు మాత్రమే ఎందుకనేది ప్రశ్న. సమాధానం సింపుల్. విడుదలకు ముందు మారుతీ ఇచ్చిన ఎలివేషన్లు, ఊరింపులు మరీ తీవ్రంగా ఉండటంతో ఫ్యాన్స్ అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ప్రతిఒక్కరు అతిగా ఊహించుకున్నారు. భారీ స్థాయిలో ఎక్స్ పెక్టేషన్స్ మొదలయ్యాయి. ఇది అసలు సమస్యను తెచ్చింది.

కల్కి, సలార్ టైంలో వాటి దర్శకులు ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ ఎక్కువ మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ రికార్డులు బద్దలయ్యాయి. కంటెంట్ మాట్లాడింది. సక్సెస్ వరించింది. కానీ రాజా సాబ్ కు రివర్స్ లో జరిగింది.

మారుతీ, ఎస్కెఎన్ పోటీ పడి పొగడ్తలతో అభిమానులను ఆకాశంలో నిలబెట్టారు. సహజంగానే హైప్ కు తగ్గ కంటెంట్ లేక జనాలు ఉసూరుమన్నారు. ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేకపోయారు. తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. ఒకవేళ రిలీజ్ కు ముందు టీమ్ ఎక్కువ హడావిడి చేయకుండా ఉంటే ఇంత రభస అయ్యేది కాదేమో. ఒకరకంగా చెప్పాలంటే ఈ ట్రోలింగ్ నుంచి పాఠం  నేర్చుకోవచ్చు.