రాజమౌళి కెరీర్ను ‘మగధీర’కు ముందు, ‘మగధీర’కు తర్వాత అని విభజించి చూడాలి. ‘మగధీర’కు ముందు వరకు ఆయన సగటు మాస్ మసాలా సినిమాలే తీస్తూ ఉండేవాడు. కానీ ఈ చిత్రంలో జానపద నేపథ్యం ఉన్న ఒక భారీ కథను విజువల్ ఎఫెక్ట్స్, కళ్లు చెదిరే యాక్షన్ ఘట్టాలతో అద్భుతంగా తీర్చిదిద్ది తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాడు.
ఆ తర్వాత ‘ఈగ’ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ను ఇంకా గొప్పగా ఉపయోగించుకుని వెండితెరపై మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. కాకపోతే ఈ సినిమాలు తీసే సమయానికి పాన్ ఇండియా ట్రెండు మొదలు కాలేదు. ఆ చిత్రాలు వేరే భాషల వాళ్లకు అంతగా రీచ్ కాలేదు. ‘ఈగ’ సినిమా చూసిన వాళ్లు హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఉందని కొనియాడారు.
గ్లోబల్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే సినిమా అని కీర్తించారు. కానీ రీచ్ తక్కువ కావడం వల్ల కమర్షియల్గా ఆ చిత్రం దాని రేంజ్ కు తగ్గట్టు ఫలితాన్ని అందుకోలేదని ఇప్పటికీ టాలీవుడ్ అభిమానులు అభిప్రాయాలు తెలుపుతూ ఉంటారు. ఆ రోజుల్లోనే 120 కోటలు పైగా కలెక్షన్లు కొల్లగొట్టినా.. ఈగ స్థాయి సినిమాకు మరింత పోటెన్షియల్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. పాన్ ఇండియా ట్రెండ్ టైమ్ లో వచ్చి ఉంటే ఈగ 500 కోట్లు కొల్లగొట్టినా ఆశ్చర్యం లేదని ఇప్పటికీ జక్కన్న ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ ఉంటారు.
ఈ మూవీని ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్కు పరిచయం చేయడానికి రాజమౌళి అండ్ టీమ్ రెడీ అవుతుండడం విశేషం. ప్రస్తుతం జక్కన్న తీస్తున్న ‘వారణాసి’ మీద ప్రపంచ స్థాయిలో భారీ అంచనాలే ఉన్నాయి. దీనికంటే ముందు ‘ఆర్ఆర్ఆర్’ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు, ఆదరణ దక్కించుకుంది. ఇటీవల ‘బాహుబలి’ రెండు భాగాలను కలిపి ‘ది ఎపిక్’ పేరుతో రీ రిలీజ్ చేస్తే మంచి స్పందన వచ్చింది.
ఈ కోవలోనే ‘ఈగ’ను కూడా రీ రిలీజ్ చేయబోతోంది రాజమౌళి టీం.
‘వారణాసి’ పేరుతో నడుస్తున్న ట్విట్టర్ హ్యాండిల్లో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘బాహుబలి’ తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా రీ ఎడిట్ చేసి, గట్టిగా ప్రమోషన్లు చేసి సినిమాను గ్లోబల్ లెవెల్లో రీ రిలీజ్ చేయబోతున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. మరి అప్పుడైనా ‘ఈగ’ సినిమాలో ఉన్న కంటెంట్ కు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా సినిమా మంచి ఫలితాన్నందుకుంటుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates