ప్రకాష్ రాజ్ గారూ… ఇది రాంగ్ స్టేట్ మెంట్

ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు కోట్లు సంపాదించినా, లక్షల అభిమానులను వెనక నిలుపుకున్నా దానికి ప్రధాన కారణం ప్రేక్షకులే. వాళ్ళు థియేటర్లకు రాకపోతే ఎవరికీ ఫుడ్ ఉండదు. అందుకే ఆడియన్స్ ని దేవుళ్లుగా భావిస్తారు హీరోలు, నిర్మాతలు.

కానీ ప్రకాష్ రాజ్ ఈ ప్రాధమిక సూత్రాన్ని మర్చిపోయారు. తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో టికెట్ రేట్ల పెంపు గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు సినిమాలు ఎవరు చూడమన్నారు, మానేయండి, ఎవరి వ్యాపారం వారిదని పెద్ద కామెంట్ చేశారు. చాలా క్యాజువల్ గా మీరు చూడకపోతే మాకేం పోదు అన్న ధోరణిలో మాట్లాడారు.

ఆడియన్స్ అనే మహారాజ పోషకులు లేకపోతే వినోద పరిశ్రమ ఎప్పుడో కూలిపోయేది. సంపాదించే నాలుగు రూపాయల్లో ఒక్క రూపాయి కేవలం సినిమాలు చూసేందుకు పెట్టే జనాలు లక్షలు కాదు కోట్లలో ఉన్నారు. ఉదాహరణకు అమెరికా, యుకెలో ఉన్న వాళ్ళందరూ రేట్లు ఎక్కువ ఉన్నాయని టికెట్లు కొనడం మానేస్తే ప్రొడ్యూసర్ కు వచ్చే నష్టం ఊహించడానికి కూడా భయంకరంగా ఉంటుంది.

అంతెందుకు తెలుగు రాష్ట్రాల్లో ఓజి, అఖండ 2 లాంటి వాటికి ప్రీమియర్ షో వద్దనుకుంటే నిర్మాత ఎంత నష్టపోతాడో వేరే చెప్పాలా. పెద్ద సినిమాలే కాదు కోర్ట్, రాజు వెడ్స్ రాంబయి లాంటి చిత్రాలకు ఊపిరి పోసింది ఓటిటిలు కాదు, టికెట్లు కొన్న జనాలు.

అంతెందుకు ఇదే ప్రకాష్ రాజ్ కు ఇచ్చే రెమ్యునరేషన్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. నిర్మాత జేబులని నింపే ప్రేక్షకుల పర్సులు నుంచే కదా. ఎవరి వ్యాపారం వారిది. నిజమే. కానీ ఇది అంత ఈజీగా ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీకి వర్తించదు. ఎందుకంటే సినిమా అనేది కస్టమర్లకు ఒక ఆప్షన్ మాత్రమే. కంపల్షన్ కాదు.

ఓ సంవత్సరం పాటు సినిమా చూడకపోతే ప్రాణానికి ఏమి కాదు. కానీ రెండు రోజులు భోజనం మానేస్తే ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. ఇది మర్చిపోయి నిర్లక్ష్యంగా ఎవరు చూడమన్నారు అనడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. ప్రకాష్ రాజ్ ఏ ఉద్దేశంతో అన్నా సరే అపార్థమయ్యే అర్థం ఇందులో చాలా ఉంది.