భారతీయ సినిమాల బడ్జెట్లు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. ఇండియన్ సినిమా పొటెన్షియాలిటీ ఏంటో ‘బాహుబలి’ సినిమా రుజువు చేయడంతో ఆ తర్వాత వందల కోట్ల బడ్జెట్లలో సినిమాలు తీయడం కామన్ అయిపోయింది. ఐతే ఇప్పుడు సెట్స్ మీద ఉన్న సినిమాల్లో అల్లు అర్జున్, అట్లీ మూవీ ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతున్నట్లు వార్తలు వచ్చాయి.
మరోవైపు ‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి ఏకంగా రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు స్వయంగా నిర్మాతే వెల్లడించారు. ఇంకోవైపు రాజమౌళి, మహేష్ బాబుల ‘వారణాసి’ మీద ఏకంగా వెయ్యి కోట్లు పెడుతున్నట్లు ప్రచారం జరిగింది. ఐతే ‘వారణాసి’ బడ్జెట్ వెయ్యి కోట్లు కాదని.. ఇంకా ఎక్కువే అని తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న ప్రియాంక చోప్రా కన్ఫమ్ చేసింది.
ప్రియాంక తాజాగా కపిల్ శర్మ నిర్వహించే టీవీ షోకు అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా ‘వారణాసి’ సినిమా బడ్జెట్ రూ.1300 కోట్లట కదా అని కపిల్ శర్మ అడిగాడు. అందుకు ప్రియాంక ‘అవును’ అని సమాధానం చెెప్పింది. తర్వాత కపిల్ కొనసాగిస్తూ.. మీరు వచ్చాకే బడ్జెట్ పెరిగిందని విన్నాం, నిజమేనా అని అడిగాడు. దానికి ప్రియాంక గట్టిగా నవ్వుతూ.. ‘‘అంటే బడ్జెట్లో సగం నా బ్యాంక్ అకౌంట్లోకే వెళ్తోందని మీరు అంటున్నారా’’ అని ప్రశ్నించింది. దీంతో షోలో ఉన్న వాళ్లందరూ గొల్లుమన్నారు.
ఆపై క్రికెటర్ నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. వారణాసి కథేంటని ప్రియాంకను అడిగారు. దీనికి ప్రియాంక ఏమీ బదులివ్వలేదు. అంతలో కపిల్ శర్మ కలుగజేసుకుని.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే విషయాన్నే ఆయన కొన్నేళ్ల పాటు ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టారు. అలాంటిది ‘వారణాసి’ కథేంటో ప్రియాంకను చెప్పనిస్తారా.. అది అసాధ్యం అనడంతో ఆమెతో పాటు అందరరూ నవ్వేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates