ఆఖరి నిమిషంలో ఆగిపోయిన అన్నగారు

అసలే బజ్ విషయంలో వెనుకబడి హైప్ కోసం నానా తంటాలు పడుతున్న వా వతియార్ (తెలుగులో అన్నగారు వస్తారు) విడుదల వాయిదా పడింది. నిర్మాత జ్ఞానవేల్ రాజా తనకు ఇవ్వాల్సిన బకాయి పది కోట్ల ముప్పై అయిదు లక్షలు వడ్డీతో సహా చెల్లించాలంటూ అర్జున్ లాల్ మోహన్ దాస్ అనే వ్యక్తి మదరాసు హైకోర్టుని ఆశ్రయించడంతో రిలీజ్ ఆగిపోయింది. కేవలం గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉండటంతో ఇంత తక్కువ టైంలో ఆఘమేఘాల మీద ఈ సమస్యను పరిష్కరించుకోవడం కష్టమే. ఏపీ తెలంగాణ అడ్వాన్స్ బుకింగ్ పెట్టిన యాప్స్ ఒక్కొక్కటిగా తీసేయడం మొదలుపెట్టాయి.

అంటే రేపు అన్నగారు రావడం లేదని అర్థమైపోయింది. కార్తీ దీని కోసమే ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి ప్రమోషన్లలో పాల్గొన్నాడు. ఇంటర్వ్యూలు ఇచ్చాడు. మీడియాను కలుసుకుని ఓపిగ్గా ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. ఇన్ని చేశాక ఇప్పుడు హఠాత్తుగా ఆగిపోతే ఫ్యాన్స్ కలవరానికి గురవుతారు. గత కొంత కాలంగా సోలో సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న కార్తీకి అన్నగారు వస్తారు చాలా కీలకం. ఇది కూడా వాయిదాల్లో నలిగిపోయిన సినిమానే. జనవరి నుంచి పెండింగ్ పడుతూ ఆఖరికి డిసెంబర్ లో మోక్షం దక్కించుకుంది. తీరా చూస్తే ఇప్పుడేమో ఈ ట్విస్టు వచ్చి పడింది.

దీనికి ప్రధాన కారణం కంగువ నష్టాలేనని చెన్నై మీడియా టాక్. ఓవర్ కాన్ఫిడెన్స్ తో దాని మీద విపరీతంగా ఖర్చు పెట్టిన జ్ఞానవేల్ రాజా అంత పెద్ద డిజాస్టర్ ఊహించలేదు. పైగా సీక్వెల్ కోసం ప్లాన్ చేసుకుని దానికి అడ్వాన్స్ బడ్జెట్ ఖర్చు పెట్టేశాడు. తీరా చూస్తే ఇప్పుడు అన్నగారు వస్తారు కూడా రిస్క్ లో పడింది. ఒకవేళ వారం లోగా సాల్వ్ చేసుకుని డిసెంబర్ 25 తీసుకొస్తారా లేక మళ్ళీ నిరవధికంగా పోస్ట్ పోన్ అంటారా వేచి చూడాలి. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ ఎంటర్ టైనర్ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. కఏంటో విచిత్రంగా అఖండ 2కి వచ్చిన సమస్యే ఇప్పుడు అన్నగారుకీ ఎదురయ్యింది.