డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు. ఎన్నడూ లేనిది రజని దీని ప్రమోషన్ కోసం అరగంటకు పైగా ప్రత్యేకమైన వీడియో ఇంటర్వ్యూ ఇవ్వడం విశేషం. అది కూడా సినిమాలో వేసిన గెటప్ తో పాటు ఇవ్వడం అన్నింటి కన్నా పెద్ద ట్విస్టు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్న రజనీకాంత్ ఒక పెద్ద బాంబు వేశారు. నరసింహ సీక్వెల్ చర్చల్లో ఉందని, నీలాంబరి పేరుతో తీసే ఆలోచనలో ఉన్నామని అన్నారు. కానీ అర్థం కానీ విషయం ఏంటంటే క్లైమాక్స్ లోనే రమ్యకృష్ణ పోషించిన ఆ పాత్ర చనిపోయింది.
మరి ఇప్పుడు ఆ పేరుతోనే సినిమా అంటే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారేమో. కానీ నిజ జీవితంలో సౌందర్య బ్రతికిలేరు కాబట్టి ఆవిడ క్యారెక్టర్ కి ఏదో ఒక ముగింపు చూపించాలి. అలా కాకుండా నీలాంబరితో ఫ్రెష్ గా వేరే సబ్జెక్టుతో తీస్తామంటే జనాలు కనెక్ట్ కారు. పైగా దర్శకుడు కెఎస్ రవికుమార్ డైరెక్షన్ మానేసి నటనకు పరిమితమయ్యారు. ఈ బాధ్యతను వేరేవాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది. చూస్తుంటే రజని ఏదో ఫ్యాన్స్ కి కాస్త ఊపునిద్దామని ఆ మాట అన్నట్టు ఉంది కానీ నిజమయ్యే సూచనలు తక్కువే. రమ్యకృష్ణ ఎలాగూ ఉన్నారు కాబట్టి ఈ ప్లాన్ మంచిదే కానీ అంత గొప్పగా సీక్వెల్ వస్తుందన్న గ్యారెంటీ లేదు.
పడయప్ప ఇప్పటిదాకా ఏ ఓటిటికి అమ్మలేదు. ఆ మాట కూడా రజనీనే చెప్పారు. తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది కానీ తమిళ ప్రింట్ మాత్రం ఆన్ లైన్ లో లేదు. ఆ మధ్య వన్ టైం టెలికాస్ట్ కోసం సన్ టీవీ ఛానల్ కు హక్కులు అమ్మారు తప్పించి మళ్ళీ రిపీట్ చూద్దామన్నా ప్రేక్షకులకు ఆ ఛాన్స్ దొరకలేదు. నరసింహ కథ కూడా తనే రాశానని చెబుతున్న రజని ఇప్పుడీ రీ రిలీజ్ పట్ల చాలా ఎగ్జైట్ అవుతున్నారు. యాభై సంవత్సరాల నట ప్రయాణం సందర్భంగా చేస్తున్న విడుదల కాబట్టి ఫ్యాన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రాండ్ సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్నారు. చూడాలి ఎలాంటి రికార్డులు వస్తాయో.
Gulte Telugu Telugu Political and Movie News Updates