ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత బజ్ కనిపించనప్పటికీ టాక్ వచ్చాక సీన్ మారిపోయింది. కాందహార్ ఫ్లైట్ హైజాక్, ముంబై తాజ్ దాడులు, పార్లమెంట్ ఎటాక్ ఘటనలను తీసుకుని పాకిస్థాన్ మాఫియా గురించి దర్శకుడు ఆదిత్య ధార్ చూపించిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఒక వర్గం క్రిటికల్ గా విమర్శిస్తున్నప్పటికీ అవేవి ఆడియన్స్ ని ఆపడం లేదు. ఆదివారం అనూహ్యమైన పికప్ చూపించిన దురంధర్ మూడు రోజులకు నోట యాభై కోట్ల క్లబ్బులో ( గ్రాస్ ) అడుగుపెట్టినట్టు ఉత్తరాది ట్రేడ్ సమాచారం.
అఖండ 2 వాయిదా పడటం వల్ల తెలుగు రాష్ట్రాల్లో దురంధర్ కు అనూహ్యమైన పికప్ దక్కింది. బాలయ్య కోసం అట్టిపెట్టిన స్క్రీన్లలో సింహ భాగం దీనికే ఇచ్చారట. ఆక్యుపెన్సీలు బాగుండటంతో నగరాలు, పట్టణాల్లో సండే షో కౌంట్ గణనీయంగా పెరిగింది. కొన్ని సెంటర్లలో మొదటి రోజు మూడు షోలు వేసిన సంఖ్య నిన్న తొమ్మిదికి చేరుకుంది. అసలైన విశేషం మరొకటి ఉంది. ముంబైలో అర్ధరాత్రి, తెల్లవారుఝామున దురంధర్ షోలు వేయడం సూపర్ హిట్ కి సంకేతం. ఎందుకంటే గతంలో జవాన్, పఠాన్, యానిమల్, గంగుబాయ్ కటియావాడి, డిమాన్ స్లేయర్, అవతార్ 2 మాత్రమే ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నాయి.
ఇప్పుడీ లిస్టులో దురంధర్ చేరింది. మూడున్నర గంటల సీరియస్ డ్రామాని ఎలాంటి ఎంటర్ టైన్మెంట్ లేకుండా జనం ఆదరించడం విశేషమే. ట్విస్ట్ ఏంటంటే సినిమా మొత్తం దాదాపు పాకిస్థాన్ లోనే జరుగుతుంది. ఇండియా లొకేషన్లు ఉండవు. కేవలం రెండు మూడు ఇంటీరియర్ సీన్లు తప్ప బ్యాక్ డ్రాప్ మొత్తం శత్రుదేశమే. అయినా సరే జనంతో కనెక్ట్ చేయడంలో ఆదిత్య ధార్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా విలన్ అక్షయ్ ఖన్నా, పోలీస్ సంజయ్ దత్ పాత్రలు విపరీతంగా ఎక్కేశాయి. వీళ్ళ గురించి మాట్లాడిన తర్వాత రణ్వీర్ సింగ్ ప్రస్తావన వస్తోంది. పెద్దగా పోటీ లేకపోవడంతో దురంధర్ కు లాంగ్ రన్ దక్కేలా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates