వాళ్లిద్దరూ కొట్టుకుంటే కరణ్ జోహార్ ట్రెండింగ్

పాపం కరణ్ జోహార్. బాలీవుడ్లో ఎక్కడే వివాదం జరిగినా ఆయన పేరు తెరపైకి వస్తోంది. సోషల్ మీడియాలో జనాలు ఆయన్ని ఆడేసుకుంటున్నారు. కొన్ని నెలల కిందట సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడితే నెటిజన్లందరూ కరణ్ జోహార్‌ను ఆడేసుకున్నారు. దానికి ముందు, తర్వాత కూడా పలు సందర్భాల్లో కరణ్ జోహార్ సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యాడు. ఒక దశలో ఆయన సోషల్ మీడియాకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి కూడా తలెత్తింది. ఇప్పుడు మరోసారి కరణ్ జోహార్‌కు సంబంధం లేకుండా ఆయన పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.

పంజాబీ నటుడు దిల్జిత్ దోసాంజ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మధ్య ట్వీట్ వార్‌లో కరణ్ పేరు అనుకోకుండా తెరపైకి వచ్చి నానా రచ్చ అయింది. ఇంతకీ వ్యవహారం ఏంటంటే..

పంజాబ్ రైతులు కేంద్ర ప్రభుత్వం తెస్తున్న కొత్త వ్యవసాయ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాజధానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. సెలబ్రెటీలు సైతం వారికి మద్దతు పలుకుతున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వానికి అధికార ప్రతినిధి లాగా మారిపోయిన కంగనా.. ఈ ఆందోళనల్లో పాల్గొన్న ఒక పంజాబీ పెద్దావిడ గురించి అభ్యంతరకరంగా మాట్లాడింది. ఆమె పెయిడ్ ఆర్టిస్ట్ అని, వంద రూపాయల కోసం ఈ ఆందోళనల్లో పాల్గొంటోందని ఎద్దేవా చేస్తూ ట్వీట్ వేసింది.

దీనిపై దిల్జిత్ మండిపడుతూ ట్వీట్ వేశారు. ఆ పెద్దావిడ గురించి అవాకులు చెవాకులు పేలొద్దని కంగనాకు గడ్డిపెట్టాడు. దీనికి బదులుగా కంగనా ఫైర్ అయిపోయింది. వ్యవహారాన్ని మరోవైపు మళ్లించింది. దిల్జిగ్.. కరణ్ జోహార్ పెంపుడు జంతువు అని వ్యాఖ్యానించింది. దానికి దిల్జిత్ బదులిస్తూ.. నువ్వు ఎవరి సినిమాల్లో అయితే చేశావో వాళ్లందరికీ పెంపుడు జంతువువేనా అని ప్రశ్నించాడు. దీనికి కంగనా.. నువ్వు బూట్లు నాకేవాడివి అంటూ తీవ్ర పదజాలం వాడింది. దిల్జిత్ కంగనాలా దిగజారి మాట్లాడుకుండానే ఆమెకు దీటుగా బదులిచ్చాడు. చివరికి అతడిదే పైచేయి అయింది కూడా. ఐతే వీళ్లిద్దరూ ఇలా గొడవ పడితే అనుకోకుండా కరణ్ జోహార్ పేరు తెరపైకి వచ్చి.. ఆయన సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిపోతున్నాడు. దీని మీద ట్విట్టర్లో జోకులు ఓ రేంజిలో పేలుతున్నాయి.,