రాజమౌళి రిలీజ్ డేట్ చెప్తారా ?

ఇంకో నాలుగు రోజుల్లో జరగబోతున్న ఎస్ఎస్ఎంబి 29 ఈవెంట్ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో కనివిని ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న వైనం అక్కడికి వెళ్లి చూసిన వారికి షాక్ కలిగిస్తోంది. వంద అడుగుల ఎల్ఈడి స్క్రీన్ పెట్టి ఎంత దూరంలో ఉన్నా కనిపించేలా రివీల్ ప్లాన్ చేసిన తీరు నభూతో నభవిష్యత్ అన్న రేంజ్ లో ఉంటుందట. కాకపోతే ఢిల్లీలో ఎర్రకోట దగ్గర బాంబు దాడి తర్వాత రెడ్ అలర్ట్ అందుకున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఉంది. సో మాములుగా ఉండే ఆంక్షల కన్నా కాస్త ఎక్కువే ఉండొచ్చని ఇన్ సైడ్ టాక్. అదే జరిగితే ఫ్యాన్స్ కి ఇబ్బందులు తప్పవు.

ఇదిలా ఉండగా ఈ వేడుకలోనే రాజమౌళి ఈ ప్యాన్ వరల్డ్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. అందరూ అనుకున్నట్టు 2027 ద్వితీయార్థంలో కాకుండా అంతకన్నా ముందే విడుదలకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతానికి ఆయన మనసులో ఏ డేట్ అనేది స్పష్టంగా ఉందని కాకపోతే ఇదే వేదిక మీద అనౌన్స్ చేస్తారా లేదానేది సస్పెన్స్ గా మారింది. శృతి హాసన్ పాడిన సంచారి మెల్లగా జనాల్లోకి వెళ్ళిపోతోంది. గ్లొబ్ ట్రాట్టర్ అనే వర్కింగ్ టైటిల్ తో నిన్న సాంగ్ ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తే హఠాత్తుగా ఊడిపడటం చూసి అభిమానులు షాకయ్యారు. ఊహించని ప్లానింగ్ ఇది.

ఇకపై కూడా ఇదే తరహాలో ఊహించని సర్ప్రైజులు చాలానే ప్లాన్ చేశారట జక్కన్న. సాంప్రదాయ పద్దతిలో రొటీన్ అనిపించేలా కాకుండా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారట. మాములుగా అయితే విలన్ పృథ్విరాజ్ సుకుమారన్ లుక్, సంచారి పాట చాలా హైప్ ఇచ్చి రిలీజ్ చేయాలి. కానీ రాజమౌళి చెప్పాపెట్టకుండా ఆ లాంఛనాలు పూర్తి చేశారు. అదే తరహాలో నవంబర్ పదిహేను నాడు మేం రాబోతున్న డేట్ ఇదే అంటూ చెబితే ఆశ్చర్యపోనక్కర్లదు. కాకపోతే ఆర్ఆర్ఆర్ కు అలాగే చేశారు కానీ కరోనా వల్ల మాట మీద నిలబడలేదు. కానీ ఎస్ఎస్ఎంబి 29కి అలాంటి అడ్డంకులు ఏవీ రాకూడదనే సగటు ఆడియన్స్ కోరిక.