ఎన్టీఆర్ ఫ్యాన్స్.. టెన్షన్ పడొద్దు

‘సాహో’తో కొంచెం ఢీలా పడ్డట్లు కనిపించాడు ప్రభాస్. అతడి మార్కెట్, ఫాలోయింగ్ దెబ్బ తిన్నాయని అనుకున్నారు. ‘రాధేశ్యామ్’ అతడి స్థాయికి తగ్గ చిత్రంగా కనిపించలేదు. కానీ దాని తర్వాత రెండు భారీ ప్రాజెక్టులు అనౌన్స్ చేసి తన రేంజ్ ఏంటో చూపించాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో చేయనున్న ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో నటించనున్న సైంటిఫిక్ థ్రిల్లర్.. రెండూ కూడా 400-500 కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతున్న భారీ చిత్రాలే.

వీటికే అభిమానులు ఉబ్బితబ్బిబ్బయిపోతుంటే.. కొత్తగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘కేజీఎఫ్’ నిర్మాతలు ప్రభాస్ హీరోగా ఓ పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘కేజీఎఫ్’ తర్వాత ప్రశాంత్ నీల్ డిమాండ్ ఎలా పెరిగిందో తెలిసిందే. ‘కేజీఎఫ్’ లాంటి సినిమానే ప్రభాస్‌కు పడితే ఎలా ఉంటుందనే ఆలోచన చాలామందిని ఎగ్జైట్ చేసింది. నిజంగానే ఆ కలయిక కార్యరూపం దాల్చబోతోందన్నది తాజా సమాచారం.

ఐతే ఈ వార్త వినగానే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిరుత్సాహపడిపోతున్నారు. ఎన్టీఆర్-నీల్-మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో సినిమా గురించి ఇంతకుముందు సంకేతాలు అయితే వచ్చాయి కానీ.. అధికారికంగా ఈ ప్రాజెక్టు గురించి ఇంకా అనౌన్స్‌మెంట్ రాలేదు. ఈలోపు ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ సినిమా ప్రకటన అనగానే వారిలో టెన్షన్ పట్టుకుంది. తాము ఎన్నో అంచనాలు పెట్టుకున్న కాంబినేషన్ ఉండదేమో అని భయపడుతున్నారు.

కానీ వాస్తవం ఏంటంటే.. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్, ప్రభాస్ ఇద్దరితోనూ సినిమాలు చేస్తారు. ముందు చేయబోయేది కూడా ఎన్టీఆర్ సినిమానే అట. ఎందుకంటే ప్రభాస్ తర్వాతి రెండు ప్రాజెక్టులు పూర్తి కావడానికి కనీసం రెండేళ్లు పడుతుంది. ఇంకా ఎక్కువ సమయం పట్టినా ఆశ్చర్యం లేదు. వాటి కంటే ముందు ప్రశాంత్ నీల్‌తో జట్టు కట్టే అవకాశాలు ఎంతమాత్రం లేదు. ప్రస్తుతానికి ప్రకటన చేస్తారేమో కానీ.. ముందు ఎన్టీఆర్‌తో సినిమా చేశాకే ప్రభాస్ సినిమా వైపు వెళ్లే అవకాశముంది ప్రశాంత్. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ పూర్తి చేసి, త్రివిక్రమ్ సినిమాను అవగొట్టడానికి ఎన్టీఆర్‌కు కూడా ఏడాది దాకా సమయం పడుతుంది. ఆలోపు ఎన్టీఆర్ సినిమాతో పాటు ప్రభాస్ చిత్రానికీ స్క్రిప్టు రెడీ చేసుకోవడానికి అతడికి సమయం దొరుకుతుందేమో.