దిల్ రాజు ఆడబోయేది సేఫ్ గేమేనా

నిర్మాత దిల్ రాజు మళ్ళీ స్పీడ్ పెంచారు. సంక్రాంతికి వస్తున్నాం ముందు వరకు వరస ఫ్లాపులతో సతమతమయ్యారు కానీ, వెంకటేష్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ కిక్ అసలు గేమ్ ఛేంజర్ తీసిన విషయాన్నే మర్చిపోయేలా మాయ చేసింది. ఇటీవల ఓజితో నైజాంలో లాభాలు కళ్లజూసిన దిల్ రాజు నితిన్ తో ప్లాన్ చేసుకున్న ఎల్లమ్మని దేవిశ్రీ ప్రసాద్ తో తీయబోతున్నారనే వార్త ఆల్రెడీ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన మీద పెద్ద బడ్జెటే పెడుతున్నారు. తమ కాంబోలో ఫ్యామిలీ స్టార్ పోయినా సరే ఈసారి దర్శకుడు రవికిరణ్ కోలా మీద నమ్మకంతో రిస్క్ కు రెడీ అయ్యారు. ఇదంతా ఒక వైపు.

ఎప్పటి నుంచో బాలీవుడ్ లో బలమైన అడుగు వేయాలనేది దిల్ రాజు ప్లాన్. జెర్సీ, హిట్ ది ఫస్ట్ కేస్ రీమేకుల్లో భాగస్వామిగా ఆ ప్రయత్నం చేశారు కానీ ఆవి చేదు ఫలితాలు ఇచ్చాయి. అయితే సోలో ప్రొడ్యూసర్ గా ముద్ర పడితే వచ్చే కిక్కు వేరుగా ఉంటుంది. విజయ్ వరిసు ద్వారా కోలీవుడ్ ముచ్చట తీర్చుకున్నారు. ఇప్పుడు నార్త్ వంతు వచ్చింది. సల్మాన్ ఖాన్ తో ఒక మూవీ చేసేందుకు దిల్ రాజు వేస్తున్న ట్రయిల్స్ దాదాపు కొలిక్కి వచ్చినట్టు ముంబై టాక్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ ప్రాజెక్టుని లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. అమీర్ నో అన్నాక వేరే ఫ్రెష్ కథతో సల్మాన్ ని ఒప్పించినట్టు తెలిసింది.

వినడానికి బాగానే ఉంది కానీ సల్మాన్ ఖాన్ అసలే బ్యాడ్ ఫామ్ లో ఉన్నారు. సికందర్ దారుణంగా పోయాక అభిమానులకు ఏం మాట్లాడాలో అంతు చిక్కడం లేదు. షారుఖ్ ఖాన్ వరసగా మూడు హిట్లతో కంబ్యాక్ అయితే అమీర్ ఖాన్ ఇటీవలే సితారే జమీన్ పర్ తో మళ్ళీ ట్రాక్ లో పడ్డాడు. బాకీ ఉన్నది సల్మాన్ ఒక్కడే. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బాటిల్ అఫ్ గాల్వన్ తీస్తున్నది కూడా అపూర్వ లఖియా అనే ఫ్లాప్ దర్శకుడే. సో ఒకవేళ నిజంగా దిల్ రాజు కనక కండల వీరుడితో సినిమా తీసే పనైతే ఆయనకు బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిన బాధ్యత తీసుకోవాలి. అఫీషియల్ అయ్యేదాకా దీని గురించిన వివరాలు బయటికి రావు.