యాక్సిడెంట్ తర్వాత చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్న మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త మూవీ సంబరాల ఏటి గట్టు ఎన్నో నెలలుగా నిర్మాణంలో ఉంది. వాస్తవానికి ముందు అనుకున్న ప్రకారమైతే సెప్టెంబర్ 25 వచ్చేయాలి. కానీ షూటింగ్ ఆలస్యం ప్లస్ ఇతరత్రా కారణాల వల్ల తర్వాత కూడా కొత్త డేట్ వేసుకోలేకపోయారు. ఓజి అదే డేట్ కి రిలీజై బ్లాక్ బస్టర్ కాగా సాయితేజ్ తో పాటు క్లాష్ కావాల్సిన అఖండ 2 ఫ్రెష్ గా డిసెంబర్ 5కి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో సంబరాల ఏటిగట్టు ఎప్పుడు వస్తుందనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. ఇవాళ హీరో పుట్టినరోజు సందర్భంగా అసుర ఆగమనం పేరుతో చిన్న టీజర్ వదిలారు.
నిమిషం వీడియోలో కథేంటో చెప్పలేదు కానీ విజువల్స్ మీద ఒక అవగాహన వచ్చేలా కట్ చేశారు. అదో సుదూర నిర్మానుష్యంగా ఉండే ఎడారి ప్రాంతం. బయట ప్రపంచానికి తెలియకుండా ఎందరో ప్రజలు అక్కడ బానిసల్లా నరకాన్ని చూస్తుంటారు. అరాచకం రాజ్యమేలుతున్న ఆ నేలపైకి అసుర రూపంలో వస్తాడో యువకుడు. దేహ దారుఢ్యంతో పాటు గుండెల నిండా ధైర్యం నిండిన అతని పేరు బలి. అసలు అక్కడ ఏం జరుగుతోంది, ఎందుకు అణిచివేతకు వేలాది ప్రజలు బలయ్యారు లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి. గుబురు గెడ్డంతో సాయితేజ్ కొన్ని ఫ్రేమ్స్ లో మావయ్య చిరంజీవిని గుర్తు చేశాడు.
దర్శకుడు రోహిత్ కెపి ఇంకో డార్క్ వరల్డ్ ని ఆడియన్స్ కి చూపించబోతున్నాడు. కెజిఎఫ్ తరహాలో ఒక షాకింగ్ వాతావరణాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని దాని ద్వారా సాయి దుర్గ తేజ్ ని ఎలివేట్ చేసే ప్రయత్నం సన్నివేశాల్లో కనిపించింది. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దానికి మరింత దోహదపడగా విజువల్ ఎఫెక్ట్స్ లో సహజత్వం, ఏఐ రెండూ మిక్స్ అయినట్టుగా ఉన్నాయి. రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాని సంబరాల ఏటిగట్టు టైటిల్ కు తగ్గట్టు సంబరాలతో కాదు చాలా సీరియస్ కంటెంట్ తో వస్తోంది. దీనికోసమే సాయిదుర్గ తేజ్ చాలా కష్టపడి ఒంటిని విపరీతంగా కష్టపెట్టి పూర్తిగా మేకోవర్ చేసుకున్నాడు
Gulte Telugu Telugu Political and Movie News Updates