హీరో వెంకటేష్, రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్లది మరపురాని కాంబినేషన్. త్రివిక్రమ్ రచనతో వెంకీ చేసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప ఫ్యామిలీ ఎంటర్టైనర్లుగా నిలిచిపోయాయి. ఐతే దర్శకుడిగా మారాక త్రివిక్రమ్తో వెంకీ సినిమా చేయాలని అభిమానులు ఆశపడ్డారు. ఇందుకు గతంలో సన్నాహాలు కూడా జరిగాయి. ఒక సినిమాను అనౌన్స్ చేశారు కూడా. కానీ అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత ఎవరి దారుల్లో వాళ్లు వెళ్లిపోయారు. ఇక ఎప్పటికీ ఈ కాంబినేషన్లో సినిమా ఉండదేమో అనుకున్నారంతా.
త్రివిక్రమ్ సినిమాల లెవెల్ మారిపోవడమే అందుక్కారణం. గుంటూరు కారం తర్వాత ఆయన అల్లు అర్జున్తో ఒక మెగా పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసుకున్నారు. కానీ అది క్యాన్సిల్ కావడం, ఆ కథే జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లడం.. ఆ సినిమా పట్టాలెక్కడానికి టైం పట్టేలా ఉండడంతో మధ్యలో అనూహ్యంగా వెంకీతో త్రివిక్రమ్ సినిమా తెరపైకి వచ్చింది. ఈ సినిమా మొదలు కావడంలోనూ కొంత ఆలస్యం జరిగింది.
ఐతే ఎట్టకేలకు ఈ కలల కాంబినేషన్లో సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రకటించాడు. వెంకీ, త్రివిక్రమ్ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. 20 నెలల తర్వాత మాటల మాంత్రికుడు మళ్లీ సెట్స్లోకి అడుగు పెడుతున్న విషయాన్ని ప్రకటించాడు నాగవంశీ. అందరి ఫేవరెట్ వెంకీతో త్రివిక్రమ్ జట్టు కట్టాడని.. తెరపై మళ్లీ ఒక మ్యాజిక్ను చూడబోతున్నారని నాగవంశీ పేర్కొన్నాడు.
ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్ మీద తన బాబాయి ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్నట్లు కూడా ప్రకటించాడు. త్రివిక్రమ్ సినిమాలన్నీ ఆ బేనర్లోనే తెరకెక్కుతాయన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్, వెంకీ కాంబో అంటే ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్ ఆశిస్తారు ప్రేక్షకులు. ఈ సినిమా కూడా అలాగే ఉండబోతోందని సమాచారం. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడవుతాయి. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాను మొదలుపెడతాడు త్రివిక్రమ్.
Gulte Telugu Telugu Political and Movie News Updates