రుక్మిణి తల్లిదండ్రులకు సెల్యూట్ చేయాలి

సప్తసాగరాలు దాటి సైడ్ ఏబిలో మెప్పించి ఆ తర్వాత వరస ఫ్లాపులు చూసినా, తాజాగా కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న రుక్మిణి వసంత్ కు పెద్ద బ్రేక్ ఎట్టకేలకు దొరికింది. రెండు షేడ్స్ ఉన్న రాణి పాత్రలో తన పెర్ఫార్మన్స్ కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే తెరమీద నటనకు మనం ఫిదా అవుతున్నాం కానీ తన తల్లితండ్రుల నేపథ్యం వింటే ముందు వాళ్లకు సెల్యూట్ చేయకుండా ఉండలేం. రుక్మిణి వసంత్ తండ్రి పేరు కల్నల్ వసంత్ వేణుగోపాల్. 2007 పాకిస్థాన్ తో జరిగిన యురి సరిహద్దు యుద్ధంలో శత్రువులతో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు.

కర్ణాటక నుంచి ప్రతిష్టాత్మక అశోక చక్ర అవార్డు అందుకున్న తొలి ఆర్మీ ఆఫీసర్ గా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయింది. రుక్మిణి తల్లిగారు సుభాషిణి వసంత్. ప్రముఖ భరత నాట్యం డాన్సర్. భర్త మరణించాక కుంగిపోకుండా తనలాగే యుద్ధభూమిలో అసువులు బాసిన జవానుల భార్యల సహాయార్థం ప్రత్యేక ఫౌండేషన్ నెలకొల్పి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వసంత్ వేణుగోపాల్ చనిపోయేనాటికి రుక్మిణి వయసు కేవలం ఏడు సంవత్సరాలు. బెంగళూరులో ఉన్న ఎయిర్ ఫోర్స్ ఆర్మీ స్కూల్ లో విద్యాభ్యాసం చేసి తల్లి ప్రోత్సాహంతో లండన్ రాయల్ అకాడెమిలో యాక్టింగ్ డిగ్రీ అందుకుంది.

ఇంత నేపథ్యం ఉన్నప్పటికీ తన అభిరుచి మేరకు నటన వైపు వచ్చిన రుక్మిణి వసంత్ గ్లామర్ పాత్రలకు దూరంగా సాయిపల్లవి తరహాలో పాత్రలను ఎంచుకోవడంతో ప్రత్యేకత నిలుపుకుంటోంది. సౌందర్యని గుర్తు చేసేలా హోమ్లీ క్యారెక్టర్స్ వైపు మొగ్గు చూపుతోంది. ఈ విభిన్న తత్వమే జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ తో పాటు యష్ టాక్సిక్ లోనూ అవకాశాలు తెచ్చి పెట్టింది. తండ్రి పేరుని తనలో కలుపుకున్న రుక్మిణి వసంత్ ఆయనకు చెడ్డపేరు తెచ్చే ఏ పని ఏ సినిమా చేయనని ఘంటాపధంగా చెబుతోంది. 2019లోనే ఎంట్రీ ఇచ్చినప్పటికీ అతి పెద్ద బ్రేక్ దక్కడానికి రుక్మిణికి ఏడు సంవత్సరాలు పట్టింది.