ధ‌నుష్‌… ఇదేం స్పీడ‌య్యా

స్టార్ స్టేట‌స్ ఉన్న వాళ్లు ఏడాదికి ఒక్క సినిమా చేయ‌డం కూడా క‌ష్ట‌మైపోతోంది. పెద్ద స్టార్లు ఏడాదికి ఒక సినిమా చేయ‌డం ఎప్పుడో ఆపేశారు. మిడ్ రేంజ్ హీరోలైనా కొంచెం స్పీడుగా సినిమాలు చేస్తే ప‌రిశ్ర‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని ఇండ‌స్ట్రీ పెద్ద‌లు అంటున్నా హీరోలు స్పీడు పెంచ‌రు. కానీ త‌మిళంలో మిడ్ రేంజ్ హీరోల్లో టాప్‌లో ఉండే ధ‌నుష్ మాత్రం సూప‌ర్ స్పీడుతో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఏడాదికి రెండుకు త‌క్కువ కాకుండా రిలీజ్‌లు ఉంటున్నాయి.

ఈ ఏడాది అయితే ధ‌నుష్ మూడు రిలీజ్‌ల‌తో షాకివ్వ‌బోతున్నాడు. ఆల్రెడీ జూన్‌లో కుబేర చిత్రంతో ప‌ల‌క‌రించాడు ధ‌నుష్‌. లేటెస్ట్‌గా ఇడ్లీ కొట్టు సినిమా వ‌చ్చింది. ఆ చిత్రానికి అత‌ను ద‌ర్శ‌కుడు కూడా. ఈ చిత్రం తెలుగులో స‌రిగా ఆడ‌ట్లేదు కానీ.. త‌మిళంలో మాత్రం సూప‌ర్ హిట్ దిశ‌గా దూసుకెళ్తోంది. ద‌ర్శ‌కుడిగా ధ‌నుష్‌కు ఇది వ‌రుసగా నాలుగో హిట్ అన్న‌మాట‌.

ధ‌నుష్ న‌టించ‌కుండా, కేవ‌లం ద‌ర్శ‌క‌త్వం మాత్ర‌మే చేసిన జాబిల‌మ్మ నీకు అంత కోప‌మా ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో రిలీజైంది. అంటే ఒక స్టార్ హీరో డైరెక్ట్ చేసిన రెండు చిత్రాలు ఒకే ఏడాది రిలీజ‌య్యాయ‌న్న‌మాట‌. ఇది అరుదైన విష‌యం. 2025లో ధ‌నుష్ హంగామా అంత‌టితో ఆగిపోవ‌ట్లేదు. వ‌చ్చే నెల‌లో మ‌రో సినిమాతో ధ‌నుష్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. అది బాలీవుడ్ మూవీ కావ‌డం విశేషం. ఆ చిత్ర‌మే.. తేరే ఇష్క్ మే. 

ఇంత‌కుముందు ధ‌నుష్‌తో రాన్‌జానా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ తీసిన ఆనంద్ ఎల్.రాయ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కృతి స‌న‌న్ ఇందులో క‌థానాయిక‌గా చేసింది. లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్ సంగీతం స‌మ‌కూర్చాడు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఇది రిలీజైన మూడు నెల‌లకే ధ‌నుస్ నుంచి మ‌రో సినిమా వ‌స్తుంది.

విఘ్నేష్ రాజా అనే యువ ద‌ర్శ‌కుడితో అత‌ను చేస్తున్న సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఆ చిత్రం ఫిబ్ర‌వ‌రిలో రిలీజ‌వుతుంది. ఇంకా అతను ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో అబ్దుల్ క‌లామ్ బ‌యోపిక్‌లో న‌టించాల్సి ఉంది. వ‌చ్చే ఏడాది కూడా ధ‌నుష్ నుంచి క‌నీసం రెండు రిలీజ్‌లు ఉండొచ్చు. ఓవైపు న‌టుడిగా, మ‌రోవైపు ద‌ర్శ‌కుడిగా ఇంత బిజీగా ఉన్న స్టార్ హీరో మ‌రొక‌రు ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీలోనే లేరంటే అతిశ‌యోక్తి కాదు.