లేడీ విలన్ డైరెక్టర్ అవుతోంది

తమిళ లెజెండరీ నటుడు శరత్ కుమార్ తనయురాలు అనే గుర్తింపుతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వరలక్ష్మి.. తక్కువ సమయంలోనే నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. హీరోయిన్‌గా ఆమె పెద్దగా సక్సెస్ కాలేదు కానీ.. క్యారెక్టర్, విలన్ రోల్స్ చేయడం మొదలుపెట్టాకే బిజీ అయింది. ముఖ్యంగా తెలుగులో ఆమెకు అదిరిపోయే రోల్స్ పడ్డాయి. 

‘క్రాక్’ మూవీలో అద్భుతంగా విలనీని పండించడంతో ఆమె టాలీవుడ్లో బిజీ ఆర్టిస్టుగా మారింది. ‘వీరసింహారెడ్డి’ సహా మరిన్ని చిత్రాలు వరలక్ష్మికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. గత ఏడాదే నికోల్ సచ్‌దేవ్ అనే ముంబయి వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైన వరలక్ష్మి.. ఈ మధ్య కొంచెం సినిమాలు తగ్గించినట్లు అనిపిస్తోంది. కానీ ఆ గ్యాప్ దర్శకురాలు కావడం కోసమని ఇప్పుడే తెలిసింది. 

‘సరస్వతి’ అనే పాన్ ఇండియా మూవీతో వరలక్ష్మి దర్శకురాలిగా పరిచయం కాబోతోంది. ఈ సినిమాకు ఆమె నిర్మాత కూడా కావడం విశేషం. దోస డైరీస్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను మొదలుపెట్టిన వరలక్ష్మి.. తన సోదరి పూజ శరత్ కుమార్‌తో కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనుంది. దర్శకురాలిగా తన తొలి చిత్రంలో ప్రియమణి, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి నటిస్తుందా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. 

అటు తమిళంలో అయినా, ఇటు తెలుగులో అయినా లేడీ డైరెక్టర్లు చాలా తక్కువ. అందులో సక్సెస్ అయిన వాళ్లు అరుదే. ప్రస్తుతం సుధ కొంగర మాత్రమే విజయవంతంగా సాగుతోంది. మరి వరలక్ష్మి కూడా అలాగే దర్శకురాలిగా తనదైన ముద్ర వేస్తుందేమో చూడాలి. థ్రిల్లర్ కథతో తెరకెక్కనున్న ‘సరస్వతి’ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది.