మంచి మనసు చాటుకున్న మిరాయ్

రేపు విడుదల కాబోతున్న ఓజికి గ్రౌండ్ సిద్ధమయ్యింది. ఏపీ తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఓజినే ప్రదర్శించబోతున్నారు. హైప్ చూస్తుంటే ఏ ఏ రికార్డులు బద్దలవుతాయోనని ట్రేడ్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇదిలా ఉండగా ఎల్లుండి నుంచి మిరాయ్ మూడో వారంలోకి అడుగు పెడుతోంది. పది రోజులు దాటిన తర్వాత కూడా ఈ మూవీకి మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా దసరా సెలవులు నాలుగు రోజుల ముందే మొదలు కావడం చాలా కలిసి వస్తోంది. ఈ నేపథ్యంలో థర్డ్ వీక్ కొనసాగించేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా ఉన్నారు. అయితే ఓజి రూపంలో బ్రేక్ పడుతోంది.

కనిపిస్తున్న డిమాండ్, పవన్ కళ్యాణ్ మీదున్న అభిమానం దృష్టిలో పెట్టుకుని మిరాయ్ కోసం ఉంచుకున్న స్క్రీన్లను మొదటి రోజు ఓజికి ఇవ్వాలని నిర్మాత టిజి విశ్వప్రసాద్ నిర్ణయించుకోవడం మంచి పరిణామం. ఎందుకంటే ఓజికి రెండు సమస్యలున్నాయి. ఒకటి టికెట్ ధరల పెంపు అది కూడా పది రోజుల పాటు. రెండోది సెన్సార్ ఇచ్చిన అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికెట్. సో కుటుంబ ప్రేక్షకులు వీకెండ్ కోసం మిరాయ్ కే ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు కొట్టిపారేయలేం. అందులోనూ రిలీజ్ రోజు నుంచి మాములు ధరలకే టికెట్లు పెట్టడం గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. సో ఇంకో వారం థియేటర్ రన్ కు ఢోకా లేదు.

సరే మిరాయ్ లెక్కలు ఎలా ఉన్నా వీకెండ్ దాకా ఓజి జపంలో బాక్సాఫీస్ తడిసి ముద్దకానుంది. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం థియేటర్లు చాలక అదనపు షోలు సరిపోక బయ్యర్లు పడే తంటాలు మాములుగా ఉండవు. హరిహర వీరమల్లు ప్రభావం కించిత్ కూడా లేకపోవడం చూస్తే ఓజి ఫీవర్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పాటలు, ట్రైలర్, టీజర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నీ హైప్ పెంచేందుకు ఉపయోగపడ్డాయి. ఇవాళ మిడ్ నైట్ వచ్చే టాక్ కోసం సినీ ప్రియులు, ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాలు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నాయి. బాగుందని మాట వినిపిస్తే చాలు వసూళ్లు బద్దలైపోతాయి.