కాంతార ఓజి వసూళ్లకు కోర్టు ఊరట

కొద్దిరోజుల క్రితం కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్రంలో ఉన్న అన్ని థియేటర్ల టికెట్ రేట్లు గరిష్టంగా 200 రూపాయలు మించకూడదని జిఓ తేవడం అక్కడి ట్రేడ్ లో ప్రకంపనలు రేపింది. ప్రీమియం స్క్రీన్లకు అదనంగా ఇంకో 36 రూపాయలు ఇచ్చింది కానీ దీని వల్ల ఆదాయం దారుణంగా పడిపోతుందని భావించిన మల్టీప్లెక్స్ యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అక్టోబర్ రెండు విడుదల కాబోతున్న కాంతార చాప్టర్ 1 ది లెజెండ్ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్ సైతం కోర్టులో పిల్ వేసిన వాళ్లలో ఉంది. ఇవాళ సదరు జిఓ మీద స్టే విధిస్తూ విచారణ వాయిదా వేయడంతో డిస్ట్రిబ్యూషన్ వర్గాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.

ట్విస్ట్ ఏంటంటే కోర్టు తీర్పు ఇలా వస్తుందని తెలియక బెంగళూరులోని చాల సింగల్ స్క్రీన్లు రెండు వందలకే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టాయి. స్టే కోసం పోరాడిన మల్టీప్లెక్సులు తమకు అనుకూలంగా జడ్జ్ మెంట్ రావడంతో ఆఘమేఘాల మీద టికెట్లు అందుబాటులో తెచ్చేందుకు పరుగులు పెడుతున్నాయి. ఇప్పుడు పరిమితి లేకపోవడంతో గరిష్టంగా డిమాండ్ కు తగ్గట్టు రేట్లు పెంచుకునే అవకాశం దొరికేసింది. దీని వల్ల ముందు ఓజి లాభపడనుండగా కాంతారకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలగనుంది. వెయ్యి రూపాయలకు పైగానే ప్రీమియర్ స్క్రీన్లలో ధరలు పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది.

దీని మీద కోర్టులో వాదోపవాదాలు సాగించేందుకు సిద్దరామయ్య సర్కార్ రెడీ అవుతోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడుని ఉదాహరణగా చూపి తమ వాదనలు వినిపించేందుకు ప్లాన్ చేస్తోందట. నిజానికి కర్ణాటకలో ఎలాంటి ఆంక్షలు లేవు కాబట్టే బెంగళూరు లాంటి నగరాల్లో ఖరీదయిన మల్టీప్లెక్సులు కొలువుతీరాయి. ఉదాహరణకు పివిఆర్ డైరెక్టర్స్ కట్ స్క్రీన్ లో సినిమా చూడాలంటె ఒక్కొక్కరు రెండు వేలకు పైగానే చెల్లించాలి. కానీ అంత రేట్ హైదరాబాద్ లో అయితే కలలో మాటే. మరి ఈ పరిణామాలు చివరికి ఎక్కడికి దారి తీస్తాయో, శాండల్ వుడ్ టికెట్ల పంచాయితీని ఎక్కడికి తీసుకెళ్తాయో చూడాలి.