సినిమాలకు అతుక్కుపోయారా.. దర్శకుడి హెచ్చరిక

లాక్ డౌన్ టైంలో జనాలు కాలక్షేపానికి ఎంచుకుంటున్న ప్రధాన మార్గం సినిమాలు చూడటం. టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌లు, మొబైల్స్ ద్వారా విపరీతంగా సినిమాలు చూస్తున్నారు జనం. ఐతే ఇలా గంటల తరబడి ఆపకుండా సినిమాలు చూడటం అంత మంచిది కాదని అంటున్నారు నిపుణులు.

డాక్టరేట్ కూడా అందుకున్న ప్రస్తుత టాలీవుడ్ దర్శకుడు శైలేష్ కొలను ఈ విషయంలో ప్రేక్షకులకు ఓ ముఖ్యమైన సూచన చేశాడు. తాను పూర్వాశ్రమంలో ఆప్టోమెట్రిస్ట్‌ (కంటి వైద్య నిపుణుడు) అని వెల్లడిస్తూ ఓ ఆసక్తికర వీడియో ద్వారా జనాలకు మెసేజ్ ఇచ్చాడు శైలేష్.

విరామం లేకుండా.. కంటి మీద రెప్ప వేయకుండా మొబైల్స్‌లో సినిమా చూస్తే కళ్లలో నీటి శాతం తగ్గిపోయి ఇరిటేషన్ వస్తుందని.. ఇది మంచిది కాదని శైలేష్ చెప్పాడు. ఇందుకోసం 20-20-20 సూత్రాన్ని పాటించాలంటూ ఓ చిట్కా చెప్పాడు.

ప్రతి 20 నిమిషాలకు ఒకసారి తలను స్క్రీన్ నుంచి పక్కకు తిప్పి 20 అడుగుల దూరంలోని ఏదైనా వస్తువును చూస్తూ 20 సార్లు కళ్లు బ్లింక్ చేయాలని.. దాని వల్ల కళ్లు తడిగా మారతాయని.. డ్రై కాకుండా ఉంటాయని అన్నాడు శైలేష్.

ఈ వీడియోలో శైలేష్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులే కనిపించడం విశేషం. మధ్యలో ఒక చోట శైలేష్ చిన్న కామెడీ కూడా చేశాడు. తన దర్శకత్వంలో వచ్చిన ‘హిట్’ లాంటి సినిమాల్ని చూస్తూ కళ్లు ఆర్పడం కష్టమే అన్నాడు. అప్పుడు మరో వ్యక్తి సీన్లోకి వచ్చి సెల్ఫ్ డబ్బా అని బోర్డు పట్టడం.. శైలేష్ చిన్నబుచ్చుకోవడం కనిపించింది. ఆ సంగతలా ఉంచితే శైలేష్ చేసిన సూచన కంటి వైద్య నిపుణులు ఎప్పుడూ చెప్పేదే. లాక్ డౌన్ టైం అనే కాదు.. ఎప్పుడూ ఈ సూచన చాలా ముఖ్యమైంతే. మొబైల్స్, కంప్యూటర్లు ఎక్కువగా చూసేవాళ్లు దీన్ని కచ్చితంగా పాటించాల్సిందే.