ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ భాగీ 4కి యునానిమస్ గా నెగటివ్ టాక్, రివ్యూలు వచ్చేశాయి. మితిమీరిన హింస, తలాతోకా లేని కథా కథనాలతో థియేటర్లో కూర్చుకున్న ప్రేక్షకులతో నరకం స్పెల్లింగ్ రాయించిందనే కామెంట్ చాలా చిన్నదని చెప్పాలి. హీరో టైగర్ శ్రోఫ్ రెండున్నర గంటల పాటు దైవాంశ సంభూతుడిలా వేల కొద్ది బుల్లెట్లు, వందల కత్తిపోట్లు తగిలించుకునా నిటారుగా నిలబడి ఫైట్లు చేసిన వైనం మంచి ట్రోలింగ్ మెటీరియల్. సంజయ్ దత్ ఈ మూవీలో నరికిన చేతులు, తలలు లెక్కబెట్టాలంటే ఒక అయిదారుగురు లెక్కల టీచర్లకు డబ్బులిచ్చి మరీ కూర్చోబెట్టాలి. అయినా వాళ్ళు కరెక్ట్ గా చెప్పలేరు.
ఇంత తేడా కంటెంట్ ఉన్న భాగీ 4 ఈ ఫ్రాంచైజ్ కి మాస్ లో ఉన్న ఫాలోయింగ్ వల్ల వీకెండ్ వరకు బాగానే వసూళ్లు రాబట్టింది. ట్రేడ్ లెక్కల ప్రకారం ఆదివారం రాకముందే ఇరవై నాలుగు కోట్లకు పైగా వసూలు చేయడం విచిత్రమే. అలాని జనాలు దీని గురించి పాజిటివ్ గా చెప్పడం లేదు. సోషల్ మీడియా వేదికగా తలంటుతూనే ఉన్నారు. దీంతో పాటే విడుదలైన ది బెంగాల్ ఫైల్స్ లో వివాదాస్పద అంశాలు, తెలుసుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నా ఆడియన్స్ దానికి దూరంగా ఉన్నారు. స్టార్లు లేకుండా మరీ మూడున్నర గంటల పాటు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి చెప్పిన కథ డాక్యుమెంటరీ ఫీలింగ్ ఇచ్చింది.
క్రిటిక్స్ ని ది బెంగాల్ ఫైల్స్ మెప్పించినప్పటికీ కమర్షియల్ గా మాత్రం డిజాస్టర్ వైపు వెళ్తోంది. దానికి భాగీ 4 కారణం కాదు కానీ నిడివి పెద్ద దెబ్బ కొట్టింది. అన్నట్టు భాగీ సిరీస్ లో ఇప్పటిదాకా వచ్చినవన్నీ రీమేకులే కావడం గమనార్హం. భాగీకి పునాది పడింది ప్రభాస్ వర్షంతో. భాగీ 2 కోసం అడవి శేష్ క్షణంని తీసుకున్నారు. భాగీ 3కి నాగచైతన్య తడాకా ఉపయోగపడింది. ఇప్పుడు భాగీ 4కి తమిళ మూవీ ఐయితు ఐయుతు ఐయుతుతో పాటు గోపీచంద్ ఒంటరి, బాలకృష్ణ లయన్ ని వాడుకున్నారు. అయినా ఉత్తరాది ప్రేక్షకులు మహా వెరైటీ. కొన్నిసార్లు తేడాగా ఉన్న డిజాస్టర్లకు కూడా కాసులు కురిపించేస్తారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates