అల్లు క‌న‌క‌ర‌త్న‌మ్మ‌… చిరు స్ఫూర్తితో

మెగా, అల్లు కుటుంబాల్లో శ‌నివారం విషాదం అలుముకుంది. అల్లు రామలింగయ్య స‌తీమ‌ణి.. అల్లు అర‌వింద్, సురేఖ‌ల త‌ల్లి అయిన అల్లు అల్లు కనకరత్నం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ శనివారం తెల్లవారుజామున‌ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె వ‌య‌సు 94 సంవ‌త్స‌రాలు. క‌న‌క‌ర‌త్న‌మ్మ మ‌ర‌ణ వార్త తెలియ‌గానే చిరంజీవి స‌హా మెగా కుటుంబ స‌భ్యులు ప‌లువురు అల్లు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. చిరంజీవి ద‌గ్గ‌రుండి అన్ని కార్య‌క్ర‌మాలూ చూసుకున్నారు. స్వ‌యంగా అత్త‌గారి పాడె మోశారు. అంత్య‌క్రియ‌ల్లోనూ పాల్గొన్నారు. ఇదే రోజు సాయంత్రం ఒక ఆసుప‌త్రికి సంబంధించిన ప్రైవేటు కార్య‌క్ర‌మ‌లో చిరు.. క‌న‌క‌ర‌త్న‌మ్మ‌కు సంబంధించి ఓ ముఖ్య‌మైన విష‌యాన్ని వెల్లడించారు.

త‌న మ‌ర‌ణానంత‌రం క‌న‌క‌ర‌త్నమ్మ త‌న క‌ళ్ల‌ను దానం చేశారు. ఈ మేర‌కు ఆమె ముందే తీర్మాన ప‌త్రం మీద సంత‌కం చేశారు. క‌న‌క‌ర‌త్న‌మ్మ బ‌తికి ఉన్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి చేపట్టిన బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ వంటి కార్యక్రమాలకు ప్రభావితులయ్యారట‌. తాను మరణించిన తర్వాత తన కళ్ళను దానం చేయాలని కుటుంబ సభ్యులకు చెప్పారట‌.. త‌న‌ కోరిక ప్ర‌కార‌మే మరణించిన తర్వాత ఆమె కళ్ళను అల్లు కుటుంబం దానం చేసింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో తెలియజేశారు. క‌న‌క‌ర‌త్న‌మ్మ‌ నేత్ర‌దానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని మెగాస్టార్ పేర్కొన్నారు. 

అర్ధరాత్రి 2 గంటలకు అరవింద్ కి ఫోన్ చేసి అత్తమ్మ కళ్ళదానం గురించి అడిగితే ఒకే అన్నాడని. గతంలో కేవలం తాను అడగానే అత్తమ్మ ఓకే అంద‌ని… ఈ రోజు ఉదయమే కళ్లదానం జరిగిందని చిరు వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా.. గ‌త కొన్నేళ్ల‌లో అనుకోని ప‌రిణామాల వ‌ల్ల మెగా, అల్లు కుటుంబాల మ‌ధ్య కొంత గ్యాప్ వ‌చ్చిన‌ట్లు క‌నిపించింది. మెగా హీరోలు.. బ‌న్నీ దూరం దూరంగా ఉంటున్నారని రోజు సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఐతే అల్లు క‌న‌క‌ర‌త్నమ్మ మ‌ర‌ణించిన సంద‌ర్భంగా చిరు, చ‌ర‌ణ్‌, వ‌రుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణ‌వ్ తేజ్.. అల్లు వారి ఇంటికి వ‌చ్చి ఆ కుటుంబంతో స‌న్నిహితంగా మెలిగారు. బ‌న్నీతో వీళ్లంద‌రూ స‌న్నిహితంగా ఉండ‌డం మెగా యూనైటెడ్ ఫ్యాన్స్‌కు ఆనందాన్నిచ్చింది.