విడుదల ఎప్పుడో ఆ రెండు ప్యాన్ ఇండియా సినిమాలకే ఇంకా నిర్ధారణగా తెలియదు. కానీ అప్పుడే కొన్ని సోషల్ మీడియా వర్గాలు ఎస్ఎస్ఎంబి 29 వర్సెస్ ఏఏ 22 అంటూ ప్రచారాలు మొదలుపెట్టేయడంతో ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. నిజానికి రెండూ 2027 రిలీజ్ ని టార్గెట్ గా పెట్టుకున్నాయి. రాజమౌళి మనసులో మార్చి 25 ఉంది. కానీ ఇప్పుడే ప్రకటిస్తే ఖచ్చితంగా డెడ్ లైన్ మీటవ్వాలనే ఒత్తిడి మొదలవుతుంది. అందుకే కనీసం సగం షూటింగ్ అయ్యాక ఆలోచిద్దామనే ఆలోచనలో ఉన్నారు. మహేష్ బాబు సైతం హడావిడి లేకుండా బెస్ట్ అవుట్ ఫుట్ కోసం ఎంత లేట్ అయినా పర్వాలేదని పూర్తి సహకారం అందిస్తున్నాడు.
ఇక అల్లు అర్జున్ – అట్లీ షూట్ వేగంగానే జరుగుతోంది కానీ పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా ఎక్కువ సమయం అవసరం పడుతుంది కాబట్టి తగినంత టైం దొరికేలా దర్శకుడు అట్లీ ప్లాన్ చేసుకుంటున్నాడు. దీపికా పదుకునే షెడ్యూల్ ఇంకా ప్రారంభం కాలేదు. మృణాల్ ఠాకూర్ తో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఇంకో ముగ్గురు హీరోయిన్ల ఎంట్రీ జరగాల్సి ఉంది. వివిధ షేడ్స్ ఉన్న పాత్రలు పోషిస్తుండటంతో వాటి కోసం ప్రత్యేకంగా గ్యాప్ తీసుకుని మరీ మేకోవర్ చేసుకునేందుకు బన్నీ ప్రిపేర్ అవుతున్నాడు. సో వచ్చే సంవత్సరం వేసవికల్లా సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయొచ్చనే క్లారిటీ రావొచ్చు. అప్పటిదాకా అన్నీ గాసిప్సే. .
ప్రోగ్రెస్ ఎలా ఉన్నా రెండూ పరస్పరం తలపడటం జరగని పని. గతంలో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములోతో క్లాష్ అయ్యారు కానీ అప్పటి పరిస్థితులు వేరు. పైగా అవి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు. సంక్రాంతి సీజన్ ని వాడుకుని భారీ లాభాలతో బయట పడ్డాయి. కానీ ఎస్ఎస్ఎంబి 29, ఏఏ 22 అలా కాదు. ఖచ్చితంగా సోలో రిలీజ్ ఉండాల్సిందే. ఎంత లేదన్నా రెండింటి మధ్య రెండు నుంచి మూడు నెలల స్పేస్ వచ్చేలా నిర్మాతలు జాగ్రత్త పడతారు. డిస్టిబ్యూటర్లు సైతం అదే కోరుకుంటారు. సో ఇప్పుడు జరుగుతున్న ప్రచారాన్ని చూసి ఉష్ అనుకోవడం తప్ప ఎవరైనా చేయగలిగింది ఏమి లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates