మంచు మనోజ్ సరైన దారిలో పడ్డాడు

ఇటీవలే భైరవంలో విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ కు ఆశించిన కంబ్యాక్ దక్కలేదు కానీ ఇకపై నటనను సీరియస్ గా తీసుకుని వరసగా సినిమాలు చేసే సందేశమైతే ఇచ్చాడు. సెప్టెంబర్ లో విడుదల కాబోతున్న మిరాయ్ లో ప్రతినాయకుడిగా నటించిన మనోజ్ ఇంకోవైపు హీరోగానూ కెరీర్ ని బలపరుచుకునే పనిలో ఉన్నాడు. తాజాగా డేవిడ్ రెడ్డి అనే ప్రాజెక్టు అనౌన్స్ అయ్యింది. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందబోయే ఈ పీరియాడిక్ డ్రామాలో మనోజ్ బ్రిటిషర్ల కాలంలో ఆంగ్లేయులకు తిరగబడిన యోధుడి పాత్రను పోషించనున్నాడు, బడ్జెట్ కూడా ప్యాన్ ఇండియా లెవెల్ లో ఖర్చు పెడుతున్నారు.

దీంతో పాటు కార్తికేయతో 90 ఎంఎల్ తీసిన శేఖర్ రెడ్డికి మనోజ్ ఇంతకు ముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జూన్ నెలలో పుట్టినరోజు సందర్భంగా ప్రకటిద్దామనుకున్నారు కానీ క్యాస్టింగ్ తదితర కారణాల వల్ల వాయిదా వేశారు. దీనికి అత్తరు సాయిబు టైటిల్ పరిశీలనలో ఉంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా పోటుగాడు, దొంగ దొంగది, మిస్టర్ నూకయ్య తరహాలో మాస్ ప్లస్ కామెడీ రెండూ ఇందులో ఉంటాయట. చిత్రీకరణ ఎప్పుడు మొదలుపెట్టేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇంతకు ముందు ఎప్పుడో ప్రారంభమైన వాట్ ది ఫిష్ సైతం మళ్ళీ రీ స్టార్ట్ అయ్యే  ప్రణాళికలో ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్.

మొత్తానికి మంచు మనోజ్ సరైన ప్లానింగ్ తో బిజీగా మారబోతున్నాడు. ఆ మధ్య కుటుంబ కలహాల వల్ల మీడియాలో హైలైట్ అయిన మనోజ్ ఇకపై సినిమాల ద్వారానే తమ ముందుకు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సరైన హిట్ పడాలే కానీ సెకండ్ ఇన్నింగ్స్ మంచిగా నిర్మించుకోవచ్చు. తన వయసు ఫామ్ లో లేని హీరోలు క్యారెక్టర్ ఆరిస్టులుగా మారిపోయిన ట్రెండ్ లో మంచు మనోజ్ ని పెట్టి ఇంకా హీరోగా సినిమాలు తీస్తున్నారంటే తన థియేటర్ ఫుల్ మీద ఉన్న నమ్మకమే. కాకపోతే దాన్ని నిలబెట్టుకునే స్థాయిలో రెండు హిట్లు పడితే సెటిలైపోవచ్చు. ఇకపై గ్యాప్ అయితే రానివ్వనంటున్నాడు మనోజ్.