ఎప్పుడు వస్తుందో ఇంకా తెలియదు కానీ రిలీజైన టైంలో భూమి బద్దలయ్యే రికార్డులు సాధించడం ఖాయమని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ కూడా బలంగా నమ్ముతున్న సినిమా ఎస్ఎస్ఎంబి 29. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ ప్యాన్ వరల్డ్ మూవీ షూటింగ్ ప్రస్తుతం బ్రేక్ తీసుకుంది. మహేష్ ఫ్యామిలీ వెకేషన్ కోసం శ్రీలంక వెళ్లిపోగా, ప్రియాంకా చోప్రా కుటుంబంతో కలిసి బహ్మాస్ తీరంలో రిలాక్స్ అవుతోంది. విలన్ గా నటిస్తున్న పృథ్విరాజ్ సుకుమారన్ రేపటి నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతున్న సర్జమీన్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగానే ఎస్ఎస్ఎంబి 29 ప్రస్తావన వచ్చింది.
ఇప్పటిదాకా ఎవరూ తెరకెక్కించని స్థాయిలో ఒక మాస్టర్ పీస్ లా దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని, ఇలాంటివి తీయడంలో ఆయన సిద్ధహస్తుడని, తమ కలయికలో రూపొందుతున్న ఈ మూవీ అంచనాలకు మించి ఉంటుందని ఊరించారు. అంతకన్నా డీటెయిల్స్ చెప్పలేదు కానీ ఆయన మొహంలో కనిపించిన ఎగ్జైట్ మెంట్ చూస్తే సలార్ కన్నా అదిరిపోయే క్యారెక్టర్ ఇందులో దక్కినట్టుగా ఉంది. తెలుగు మార్కెట్ మీద దృష్టి పెడుతున్న పృథ్విరాజ్ సుకుమారన్ సరైన అవకాశం అనిపిస్తే ప్రతికూల ఛాయల్లో నటించడానికి కూడా ఓకే అంటున్నారు. అందుకే జక్కన్నకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఆ దేశపు పరిస్థితుల వల్ల కెన్యా వెళ్లాల్సిన ప్లాన్ ని మార్చుకున్న ఎస్ఎస్ఎంబి 29 బృందం ఆగస్ట్ లో ఆఫ్రికా వెళ్లొచ్చని టాక్. జంతువులు, అడవుల బ్యాక్ డ్రాప్ లో వచ్చే కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్లు అక్కడే తీయాల్సి ఉంది. ఒకవేళ వెళ్లడం ఆలస్యమయ్యే పక్షంలో రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఖరీదైన వారణాసి సెట్లో చిత్రీకరణ మొదలవుతుంది. ఎక్కువ ఆలస్యం జరగకుండా 2027 మార్చి విడుదలని టార్గెట్ గా పెట్టుకున్న రాజమౌళి దానికి అనుగుణంగానే షెడ్యూల్స్ వేసుకుంటున్నారు. ఇప్పటిదాకా ప్రెస్ మీట్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమానికి సంబంధించిన వీడియో కూడా వదలకపోవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates