వంశీ చెప్పిన తారక్-త్రివిక్రమ్ సినిమా కబుర్లు

జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో త్రివిక్రమ్ తీయబోయే మైథలాజికల్ మూవీపై వాళ్లిద్దరి అభిమానుల్లోనే కాక తెలుగు ప్రేక్షకులందరిలోనూ ప్రత్యేక ఆసక్తి ఉంది. ఈ సినిమా సుబ్రహ్మణ్య స్వామి జీవిత గాథ అన్న సంగతి ఇప్పటికే వెల్లడైంది. ఇప్పటిదాకా ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాలు, యాక్షన్ సినిమాలే చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. తొలిసారి ఇలాంటి భారీ చిత్రాన్ని డీల్ చేయబోతున్నాడు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది.. ఎప్పుడు రిలీజవుతుంది.. మేకింగ్ ఎలా ఉండబోతోంది.. అనే క్యూరియాసిటీ అభిమానుల్లో ఉంది. దీని గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పాడు నాగవంశీ.

త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని విక్టరీ వెంకటేష్‌తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆగస్టులో మొదలవుతుందని నాగవంశీ వెల్లడించాడు. ఇది వచ్చే ఏడాది వేసవి ఆరంభంలో రిలీజవుతుందని కూడా క్లారిటీ ఇచ్చాడు. ఐతే దీంతో సమాంతరంగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా కోసం ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతాయని అతను చెప్పాడు. దీనికి సంబంధించిన వర్క్ ఇప్పటికే మొదలైందన్నాడు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఒక అనౌన్స్‌మెంట్ వీడియో అనుకున్నామని.. కానీ ఇటీవల ‘రామాయణం’ గ్లింప్స్ చూశాక దానికి దీటుగా, ఇంకా మించి ఉండాలనే ఉద్దేశంతో కొంచెం టైం తీసుకుని ప్రోమో రెడీ చేయాలని ఫిక్సయ్యామని వంశీ తెలిపాడు. 

వెంకీ సినిమా రిలీజయ్యాక ఇంకో నాలుగైదు నెలలు ప్రి ప్రొడక్షన్ పనులు చేశాక, వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో తారక్ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తామని చెప్పాడు. త్రివిక్రమ్ తొలిసారి చేస్తున్న మైథలాజికల్ మూవీ కావడంతో దీన్ని భారీగా, అత్యుత్తమ స్థాయిలో తీయడానికి ప్రయత్నిస్తామని.. భారీగా విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ సినిమా కాబట్టి.. ఆ వర్క్ అంతా పూర్తయ్యేదాన్ని బట్టి 2027 లేదా ఆ తర్వాతి ఏడాది సినిమా రిలీజ్ కావచ్చని వంశీ తెలిపాడు.