ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అనే పాట అప్పుడప్పుడు ఇండస్ట్రీ ట్రెండ్స్ కి సరిపోతుంది. ఎన్నో ఆశలతో ఇటీవలే విడుదలైన తమ్ముడు ఊహించని విధంగా డిజాస్టర్ కావడంతో టీమ్ తో పాటు ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదో ఫ్లాప్ అయినా కనీసం వీకెండ్ వసూళ్లతో కొంత ఊరటనిచ్చేది. కానీ తమ్ముడు టాక్ మరీ దారుణంగా వచ్చింది. ట్విట్టర్ హ్యాండిల్ లో కాసిన్ని ట్వీట్లు వేయడం తప్ప నిర్మాణ సంస్థ ప్రమోషన్లు ఆపేసింది. వీకెండ్ ప్రెస్ మీట్లు, బాణా సంచా కాల్చడాలు లాంటి వాటికి దూరంగా ఉంది. ఫలితాన్ని ఇంత త్వరగా అంగీకరించే నిర్మాణ సంస్థలు అరుదు.
సరే తమ్ముడు రిజల్ట్ తేలిపోయింది కాబట్టి ఇక్కడితో మర్చిపోదాం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇదే దిల్ రాజు బ్యానర్ లో నితిన్ నెక్స్ట్ సినిమా ఎల్లమ్మ ఉంది. ఇంకా సెట్స్ కు వెళ్ళలేదు. స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని దర్శకుడు వేణు యెల్దండి రాజుగారి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది కూడా పెద్ద బడ్జెట్ డిమాండ్ చేస్తోంది. స్క్రిప్ట్ మీద ఎన్నో నెలల పని జరిగింది. నానినే ఇష్టపడ్డాడు కానీ వేరే కారణాల వల్ల వదులుకున్నాడు. చివరికి నితిన్ ని చేరింది. తమ్ముడు ఎలాగూ బ్రహ్మాండంగా ఆడేస్తుందనే నమ్మకంతో రాజుగారు ఎల్లమ్మకు అవసరమయ్యే ఖర్చు గురించి పెద్దగా ఆలోచించలేదు.
లేటెస్ట్ టాక్ ఏంటంటే ఎల్లమ్మకు పోస్ట్ మార్టం అవసరమవుతుందట. అంటే ఒకసారి స్క్రిప్ట్ మొత్తం అనాలిసిస్ చేసుకుని, ఖర్చు తగ్గించుకోవడానికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో వెతుక్కుని, ఓటిటి రేట్ సాధ్యాసాధ్యాలు విశ్లేషించుకుని రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారట. ముందు అనుకున్న ప్రకారమైతే జూన్ లోనే ఎల్లమ్మ షురూ కావాలి. కానీ ఆలస్యమయ్యింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించే అవకాశమున్న ఎల్లమ్మ కూడా బలగం తరహాలో విలేజ్ డ్రామానే. కాకపోతే పీరియాడిక్ సెటప్ ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది నితిన్ ను డూ ఆర్ డై సిచువేషన్ లాంటిది. రెండో ఆప్షన్ లేదు. గెలవాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates