మొన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో తమ్ముడుకి ముందు రోజే ప్రీమియర్లు వేస్తామని చెప్పిన నిర్మాత దిల్ రాజు మనసు మార్చుకున్నట్టు తాజా అప్డేట్. కంటెంట్ మీద ఎంతో నమ్మకం ఉన్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రిస్క్ వద్దని సన్నిహితులు వారించడంతో స్పెషల్ షోలు వద్దనుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ నోట్ రాకపోవచ్చు. రెండు రకాలుగా ఇది మంచి నిర్ణయమని చెప్పొచ్చు. మొదటిది తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. సాయంత్రమైతే చాలు కాలు బయట పెట్టే సీన్ లేదు. సో ఎక్కువ ఆక్యుపెన్సీని ఆశించలేం.
రెండో కారణం గేమ్ ఛేంజర్ మీద శిరీష్ చేసిన కామెంట్లు. ఏకు మేకైనట్టు అవి ఏకంగా క్షమాపణ దాకా వెళ్లాయి. మెగా ఫ్యాన్స్ శాంతించారు కానీ తమ్ముడు గురించి ఏ చిన్న మిక్స్డ్ టాక్ వచ్చినా అది సోషల్ మీడియాలో ఇంకోలా రిఫ్లక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందులోనూ గత కొన్ని నెలల్లో కోర్ట్ లాంటి చిన్న సినిమాలు తప్ప భారీ చిత్రాలేవీ ప్రీమియర్ల జోలికి వెళ్ళలేదు. కుబేర, కన్నప్ప లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ సైతం రెగ్యులర్ షోలకే మొగ్గు చూపాయి. ఒక రకంగా ఇది వాటికి ప్లస్ అయ్యింది. సంక్రాంతికి వస్తున్నాంకు వేయని ప్రీమియర్లు తమ్ముడుకి ఎందుకనే అభిప్రాయంలో లాజిక్ ఉంది కనక ఆలోచించాల్సిన విషయమే.
సో తమ్ముడు ఎలా ఉండబోతోందనేది ఎల్లుండి మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఫాన్స్ కొంచెం రిలాక్స్ అవ్వొచ్చు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు ఎస్విసి చాలా ఖర్చు పెట్టింది. కేవలం ప్రొడక్షన్ కే ముప్పై ఐదు కోట్లు పెట్టడమంటే మాటలు కాదు. ఈ క్వాలిటీ చూసే రెగ్యులర్ గా దిల్ రాజు సినిమాలు తీసుకునే అమెజాన్ ప్రైమ్ కాకుండా నెట్ ఫ్లిక్స్ అధిక రేట్ ఇచ్చి కొనుక్కుందనే టాక్ ఆల్రెడీ ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది. నితిన్ కన్నా ఎక్కువగా ప్రమోషన్లలో కనిపిస్తున్న దిల్ రాజుకి తమ్ముడు సక్సెస్ చాలా కీలకం. రిలీజ్ లో జరిగిన ఆలస్యానికి న్యాయం జరగాలంటే ఫలితం పాజిటివ్ గా ఉండాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates