ఒకప్పుడు యానిమేషన్లకు విపరీతమైన క్రేజ్ ఉండేది కానీ ఎప్పుడైతే సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ డామినేషన్ మొదలయ్యిందో అక్కడి నుంచి సీన్ మారిపోయింది. కానీ సలార్, కెజిఎఫ్ నిర్మాతలు హోంబాలే ఫిలిమ్స్ ఈ రంగంలో కొత్త రకం విప్లవం తెచ్చేందుకు సిద్ధ పడుతున్నారు. మహావిష్ణు అవతారాలను ఆధారంగా చేసుకుని 2025 తో మొదలుపెట్టి 2037 దాకా అంటే పన్నెండు సంవత్సరాలకు సరిపడా ఒక యునివర్స్ లైనప్ సిద్ధం చేస్తోంది. అంతే కాదు ఏ సంవత్సరంలో ఏది విడుదలవుతుందో ముందే చెప్పేస్తున్నారు. ఈ సిరీస్ లో మొదటి భాగం మహావతార్ నరసింహ జూలై 25 థియేటర్లలో రిలీజ్ కానుంది.
దీని తర్వాత పరశురామ్, రఘునందన్, ద్వారకేష్, గోకులానందా, కల్కి పార్ట్ 1, కల్కి పార్ట్ 2 ఇలా మొత్తం ఏడు సినిమాలని ఒక ప్యాకేజ్ గా అందించబోతున్నారు. ఇవన్నీ యానిమేషన్ లోనే ఉంటాయి. కాకపోతే విజువల్స్ రిచ్ గా నిజమేనా మనుషులను చూస్తున్న భ్రమను కలిగించేలా ఉంటాయని టీమ్ చెబుతోంది. ఈ తరహా ప్రయోగం గతంలో కొచ్చడయాన్ తో రజనీకాంత్ చేశారు కానీ ఆశించిన ఫలితం అందుకోలేదు. కానీ మహావీర్ సిరీస్ అలా ఉండదట. చిన్నా పెద్ద అబ్బురపడే స్థాయిలో గ్రాఫిక్స్ తో పాటు అందరూ తెలుసుకోవాల్సిన ఇతిహాసాలను అర్ధమయ్యే రీతిలో చూపించడం మహావీర్ ప్రధాన లక్ష్యమట.
ఒకపక్క ప్యాన్ ఇండియా సినిమాలతో వేల కోట్ల పెట్టుబడులను పారిస్తున్న హోంబాలే ఫిలిమ్స్ ఇప్పుడీ యానిమేషన్ ప్రపంచం ద్వారా మరో సంచలనానికి శ్రీకారం చుడుతోంది. అసలే ఏఐ టెక్నాలజీ తాలూకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో సోషల్ మీడియాలో శాంపిల్స్ రూపంలో చూస్తున్నాం. అలాంటిది ఒక అగ్ర నిర్మాణ సంస్థ యానిమేషన్ ట్రెండ్ సెట్ చేయడానికి పూనుకుంటే దానికి ఏఐ చేసే మేలు గురించి వేరే చెప్పాలా. బెంగళూరు టాక్ ప్రకారం మహావీర్ లో ఎలాంటి రియల్ టైం యాక్టర్స్ ఉండరు. కృత్రిమంగా సృష్టించబడిన పాత్రలే తెరమీద అద్భుతాలు చేయబోతున్నాయి. చూడాలి ఎలాంటి స్పందన వస్తుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates