ఈ రోజు శుక్రవారం కొత్త సినిమాలు అరడజనుకు పైగానే ఉన్నా అసలివి వస్తున్న ఊసే లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. థగ్ లైఫ్ ఒక రోజు ముందే వచ్చేసింది కాబట్టి దాని హడావిడి టాక్ వచ్చాక తగ్గిపోయింది. కానీ ఇన్నేసి న్యూ రిలీజులు ఉంటే కనీసం సౌండ్ లేకపోవడం వింతే. వాటిలో ఇద్దరు ట్రెండింగ్ హీరోలు ఉండటం మరో షాక్. ఆయ్, మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ ఫేమ్ నితిన్ నార్నె శ్రీశ్రీశ్రీ రాజావారు ఇవాళ వచ్చింది. నిజానికిది ఎప్పుడో పూర్తయిన మూవీ. రకరకాల కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగ్నేశ దర్శకత్వం వహించినా కనీస పబ్లిసిటీ లేకపోవడం ఇంకో వెరైటీ,.
మ్యాడ్ సిరీస్ తో పాపులారిటీ తెచ్చుకున్న సంగీత్ శోభన్ గ్యాంబ్లర్స్ కూడా ఈ రోజే అడుగుపెట్టింది. దీనికీ మినిమమ్ పబ్లిసిటీ చేయలేకపోయారు. నితిన్ నార్నె లాగే సంగీత్ ఎప్పుడో ఒప్పుకుని చేసిన మూవీ ఇది. నిడివి ఎక్కువ లేదనేది ఇన్ సైడ్ టాక్. సరే బజ్ సంగతి ఎలా ఉన్నా కనీస ఓపెనింగ్స్ అయినా తెస్తారా అంటే ఆ సూచనలైతే లేవు. అడ్వాన్స్ బుకింగ్స్ జాడే లేదు. బిసి సెంటర్లలో ఉదయం షోలు పడినా గొప్పే అనుకోవాలి. ఇవి కాకుండా పాడేరు 12వ మైలు, బద్మాషులు, మిషన్ 007, నేటి ద్రౌపతి, షూటర్ అని ఇంకొన్ని రేసులో ఉన్నప్పటికీ ఆడియన్స్ కి కనీస స్థాయిలో రిజిస్టర్ కాలేదు.
జూన్ 12 హరిహర వీరమల్లు వస్తుందనే గ్యారెంటీతో జూన్ మొదటి వారంలో మీడియం రేంజ్ నిర్మాతలు తమ సినిమాలు ప్లాన్ చేసుకోలేదు. తీరా చూస్తే పవన్ తప్పుకున్నారు. కానీ తగినంత సమయం లేకపోవడంతో వేరేవి షెడ్యూల్ చేయడానికి టైం లేకపోయింది. ఈ రకంగా థియేటర్లు మరికొన్ని రోజులు డ్రై పీరియడ్ ని చవి చూడబోతున్నాయి. గత వారం వచ్చిన భైరవం కూడా అంతంత మాత్రంగానే పెర్ఫార్మ్ చేయడంతో ఎగ్జిబిటర్ల కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. ఇప్పట్లో ఊరట దొరకడం కష్టమే. జూన్ 20 ధనుష్ – నాగార్జున కుబేర వచ్చే దాకా ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.