జూన్ 12 ఎంతో దూరంలో లేదు. ఇంకొక్క పదమూడు రోజులు గడిచిపోతే వచ్చేస్తుంది. హరిహర వీరమల్లుని థియేటర్లలో చూసేందుకు అభిమానులు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. విపరీతమైన జాప్యం వల్ల బజ్ హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ దర్శకుడు జ్యోతికృష్ణ, నిర్మాత ఏఎం రత్నం చెబుతున్న మాటలను బట్టి చూస్తే విజువల్ ట్రీట్ ఖాయమనే అనిపిస్తోంది. హైప్ సంగతి ఎలా ఉన్నా విడుదల రోజు నాటికి వాతావరణం మొత్తం మారిపోవడం ఖాయం. సోషల్ మీడియా, ఆఫ్ లైన్ ఎక్కడ చూసినా వీరమల్లు బుకింగ్స్ కి సంబంధించిన వార్తలు, ఓపెనింగ్స్ గురించిన అంచనాలతో హోరెత్తిపోతాయి.
ఇదిలా ఉండగా ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక మిడ్ నైట్ ప్రీమియర్లకు అనుమతులు దొరుకుతున్నాయి. పుష్ప 2, దేవర, గేమ్ చేంజర్ లాంటి ప్యాన్ ఇండియా సినిమాలు ఈ సౌలభ్యాన్ని వాడుకున్నాయి. అయితే హరిహర వీరమల్లు విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ నిర్దయగా అర్ధరాత్రి షోలకు ససేమిరా అంటున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇటీవలే జరిగిన పరిణామాలు, బందు వివాదం, థియేటర్లలో తనిఖీలు, ప్రేక్షకుల హక్కులను కాపాడే విషయంలో తీసుకోబోయే కఠినమైన ఆంక్షలు ఇవన్నీ రెండు ప్రెస్ నోట్ల ద్వారా పవన్ తన ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి షోల గురించి సీరియస్ గానే ఆలోచిస్తున్నారట.
ఒకవేళ ఇవి వద్దనుకుంటే తెల్లవారుఝామున 4 గంటలకు పక్కాగా పడతాయి. ఏఎం రత్నం ఫిలిం ఛాంబర్ ద్వారా అర్జీ పెట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. ఫ్యాన్స్ మాత్రం మిడ్ నైట్ షోలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత గ్యాప్ తర్వాత పవన్ సినిమాని ప్రీమియర్ల రూపంలో చూడకపోతే ఎలా అంటూ నిలదీస్తున్నారు. అందులోనూ డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న మొదటి సినిమా. సెలబ్రేషన్స్ ని కనివిని ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకునే పవన్ వద్దంటున్నారో ఏమో. ఇంకో రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చేలా ఉంది. అప్పటిదాకా ఈ సస్పెన్స్ తప్పదు మరి.