ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రెస్ నోట్ టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. తెలుగు పరిశ్రమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు తెలుపడమనే వ్యంగ్యాస్త్రంతో మొదలుపెట్టి రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ పట్ల ప్రభుత్వం అనుసరించబోయే ధోరణి గురించి సవివరంగా చెప్పడం నిర్మాతల్లో తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. కూటమి ఏర్పడి ఏడాది కావొస్తున్నా ఇప్పటిదాకా టాలీవుడ్ సంఘాలు, ప్రతినిధులు ఎవరూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కనీసం మర్యాదపూర్వకంగా అయినా కలవకపోవడం పట్ల ధర్మాగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ ప్రస్తావించిన విషయాలు చాలా సీరియస్ గా ఉన్నాయి.
కొత్త రిలీజులు దగ్గర ఉన్నప్పుడు డిప్యూటీ సిఎంని వ్యక్తిగతంగా కలవడం, టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు తెచ్చుకోవడం మినహా ఎలాంటి స్పందన లేదని, ఇకపై సమస్యలైనా విన్నపాలైనా పర్సనల్ మీట్స్ ఉండవని చెబుతున్న పవన్ కేవలం అసోసియేషన్ల ద్వారా మాత్రం సంప్రదింపులు చేయాలని గట్టిగా చెప్పేశారు. అంటే ఇకపై ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎవరైనా సరే వ్యక్తిగత కారణాల మీద అపాయింట్మెంట్స్ ఉండవన్న మాట. కొందరు నిర్మాతలు గతంలో కలవడం గురించి పేర్లతో సహా ఉటంకించిన లేఖలో అలాంటి సంఘటిత వాతావరణం ఎప్పుడూ ఉండే సూచనలు కనిపించడం లేదని పేర్కొన్నారు.
థియేటర్ల ఆదాయాలు, పన్నుల రాబడి, వాటిలో సౌకర్యాలు, మల్టీప్లెక్సుల పేరిట జరుగుతున్న వ్యాపారంలోని లొసుగులు, టికెట్ రేట్ల విషయంలో ఏర్పడుతున్న సానుకూలత వ్యతిరేకత ఇలా అన్నింటి పైనా సమీక్షలు, రిపోర్టులు తీయబోతున్నారు. ముఖ్యంగా పరిశ్రమలో గుత్తాధిపత్యం మీద దృష్టి పెడతామని లేఖలో చెప్పడం కొందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఉన్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ హర్టవ్వడం చాలా దూరం వెళ్లేలా ఉంది. పదవిలో ఉన్నది మన హీరోనే, మన మంత్రినే కదా, అన్నీ జరిగిపోతాయనే నిర్లక్ష్య భావనకు తగిన మూల్యం చెల్లించే టైం దగ్గర్లోనే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పుడీ నోట్ తాలూకు పరిణామాల తీవ్రత ఏ స్థాయిలో ఉండబోతోందో ఇప్పుడే ఊహించడం కష్టం. ఎందుకంటే నిన్నటి దాకా సాఫ్ట్ గా ఉన్న పవన్ ఒక్కసారిగా ఇంత స్థాయిలో స్పందించడం వెనుక జూన్ 1 థియేటర్ల బంద్ ప్రచారం ఒక కారణం కాగా, హరిహర వీరమల్లు రిలీజ్ దగ్గర్లోనే ఇలాంటి పిలుపులకు ఆస్కారం ఎవరిచ్చారనే దాని గురించి విచారణ కూడా తీవ్రంగానే జరిగేలా ఉంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు అందరూ కలిసి సిఎం, డిసిఎంని కలిసినా పవన్ వెంటనే చల్లారకపోవచ్చని జనసేన వర్గాలంటున్నాయి. కూర్చున్న చెట్టుని నరుక్కున్న చందంగా కొందరి నిర్లిప్త వైఖరి ఇక్కడిదాకా తెచ్చిందన్నది వాస్తవం.