వెంకటేష్ సరసన సప్తసాగరాల భామ ?

హిట్టు ఫ్లాపుల సంగతి ఎలా ఉన్నా టాలీవుడ్ లో బ్రహ్మాండమైన అవకాశాలు దక్కించుకునే పనిలో ఉన్న కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ మరో జాక్ పాట్ కొట్టబోతోందని ఫిలింనగర్ టాక్. త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్ కలయికలో రూపొందబోయే ఎంటర్ టైనర్ కోసం తనను సంప్రదించినట్టు సమాచారం. ఆనందరావు, కుటుంబరావు టైటిల్స్ ప్రచారంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయట. త్రివిక్రమ్ స్క్రిప్ట్ లాకైపోయిందని, ఆలు అర్జున్ తో ప్యాన్ ఇండియా మూవీ ఇంకా లేటవుతున్న నేపథ్యంలో ఈ లోగా వెంకీ మూవీని పూర్తి చేసి 2026 సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ప్రస్తుతానికి ఇది గాసిప్ స్టేజిలోనే ఉంది కాబట్టి రుక్మిణి వసంత్ ఉన్నది లేనిది తేలడానికి ఇంకొంత సమయం పట్టొచ్చు. ప్రస్తుతం తను జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులో ఉంది. ఇది కాకుండా మణిరత్నం – నవీన్ పోలిశెట్టి కాంబో మూవీకి కూడా తననే పరిశీలిస్తున్నారనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో తిరుగుతోంది. నిర్ధారణగా ఆధారాలు లేవు కానీ లీక్స్ ని బట్టి చూస్తుంటే అబద్దమని కొట్టి పారేయలేం. రుక్మిణి ఇప్పటిదాకా తెలుగులో స్ట్రెయిట్ గా చేసిన చిత్రం నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఒక్కటే. కాకపోతే ఫ్లాప్ అయ్యింది. తారక్ తో కలిసి నటించే బంపర్ ఆఫర్ సప్తసాగరాలు దాటి వల్ల వచ్చింది.

తన టాపిక్ పక్కనపెడితే వెంకీ త్రివిక్రమ్ కాంబోకి దాదాపు రంగం సిద్ధమైనట్టే. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి హిలేరియస్ మూవీస్ కి డైలాగులు రాసిన మాటల మాంత్రికుడు ఇప్పుడు వెంకీనే డైరెక్ట్ చేస్తారంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పాలా. హారిక హాసిని బ్యానర్ పై దీన్ని రూపొందించవచ్చని వినికిడి. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ ఒప్పుకున్న సినిమాల్లో మెగాస్టార్ 157 తో పాటు త్రివిక్రమ్ ది ఉందట. రెండూ అఫీషియల్ కావాల్సి ఉంది. నాలుగు నెలల నుంచి వెంకీ మామ పూర్తి రెస్ట్ మోడ్ లో ఉంటూ రిలాక్స్ అవుతున్నారు. రానా నాయుడు 2 కోసం త్వరలో ప్రమోషన్లు మొదలుపెట్టబోతున్నారు.